5 Years Vehicle Insurance | కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఐదేండ్ల బీమా తప్పనిసరి కానున్నది. దీనివల్ల ఆయా వాహనాల ధరలు పెరుగుతాయా? అంటే అవుననే అంటున్నారు ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు. వాహనాల కొనుగోలు వ్యయం ఎనిమిది నుంచి 10 శాతం పెరుగనున్నది. టూ వీలర్స్పై రూ.5,000-6,000, ఎంట్రీ లెవెల్ కార్ల కొనుగోలుపై రూ.50 వేలు, మధ్యశ్రేణి ఎస్యూవీ కార్లపై రూ.2 లక్షలపై చిలుకు భారం పడనున్నదని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి చెప్పారు. డ్రైవర్, యజమాని, ఇతర ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా ఐదేండ్ల బీమా పాలసీ తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
గతేడాది ఆగస్టు నుంచి కొత్త వాహనాలకు దీర్ఘకాలిక బీమా తప్పనిసరి అన్న నిబంధనను భారత బీమా అభివ్రుద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఉపసంహరించుకోవడం గమనార్హం. కానీ మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కొనుగోలు దారులపై భారం పడుతుందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా చెప్పారు. వాహనాల కొనుగోలుదారులకు నెలవారీ ఫ్లెక్సిబుల్ చెల్లింపుల విధానాన్ని బీమా రంగం అమలులోకి తీసుకు రావాలని రవి భాటియా అభిప్రాయ పడ్డారు.
వినియోగదారుడి ప్రయోజనాలు, సేఫ్టీ, కొనుగోలు వ్యయం, ఉత్పాదకత, ఉద్యోగాల కల్పన, పర్యావరణ.. కర్బన ఉద్గారాల నియంత్రణ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆమోద యోగ్యమైన ( holistic view ) విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఎంజీ మోటార్స్ సీఈవో, ప్రెసిడెంట్ రాజీవ్ ఛాబా అన్నారు. లేకపోతే అసాధారణ వ్రుద్ధిరేటు సాధ్యం కాదన్నారు.
బీమా సంస్థలు దీనిపై మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర కవరేజీతో కూడిన బీమా పాలసీ తీసుకోవడం ఇరుపక్షాల మధ్య స్వచ్ఛందంగా ఆమోదయోగ్యం అని, బలవంతంగా కస్టమర్పై రుద్దవద్దని చెబుతున్నాయి. ప్రస్తుతం 99 శాతం నూతన వాహన కొనుగోలు దారులు సమగ్ర బీమా కవరేజీకి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారని పేర్కొన్నాయి.