Cognizant-Income Tax | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్కు మద్రాస్ హైకోర్టు బిగ్ రిలీఫ్ కల్పించింది. కాగ్నిజెంట్ చెల్లించాల్సిన రూ.4,300 కోట్ల పన్ను బకాయిల స్థానే కంపెనీ రూ.2,956 కోట్ల విలువ గల డిపాజిట్లను లిక్విడేట్ చేస్తూ ఆదాయం పన్ను విభాగం జారీ చేసిన ఆదేశాలపై మద్రాస్ హైకోర్ట్ తాత్కాలిక స్టే జారీ చేసింది. అయితే, నాలుగు వారాల్లో పన్ను బకాయిల్లో రూ.1500 కోట్లు ఆదాయం పన్నుశాఖకు చెల్లించాలని, మిగతా బకాయిల కోసం సంస్థ ఆస్తులను సెక్యూరిటీగా చూపాలని జస్టిస్లు ఆర్ మహదేవన్, మహ్మద్ షఫీఖ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.
తాము విధించిన షరతులకు లోబడి గడువులోగా పన్ను బకాయి చెల్లించి, ఆస్తులను సెక్యూరిటీగా చూపకపోతే తాత్కాలిక స్టే ఆటోమేటిక్ ఎత్తివేస్తామని డివిజన్ బెంచ్ తెలిపింది. అలాగే ఆదాయం పన్ను బకాయిలను చెల్లించడానికి కాగ్నిజెంట్ యాజమాన్యానికి వెసులుబాటు కల్పించాలని ఆదాయం పన్నుశాఖకు ఆదేశాలిచ్చింది. రూ.4300 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలని ఆదాయం పన్నుశాఖ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఇన్ కం టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)లో కాగ్నిజెంట్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ కాగ్నిజెంట్ అభ్యర్థనను ఐటీఏటీ గత సెప్టెంబర్ 13న తోసి పుచ్చింది.