సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అమలు చేస్తున్నది… దేశం ఆచరిస్తున్నది. అన్న మాట ఒక్కో రంగంలో అక్షరాలా నిజమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనే కాదు సరికొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ దేశానికి మార్గం చూపుతోంది. అందుకు నిదర్శనం టీ హబ్. అలాంటి టీ హబ్ను స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో సైతం ఆవిష్కరణల కోసం ఎం-హబ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఇందుకోసం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు(ఐటీఈఎస్) పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో మహరాష్ట్ర హబ్ (ఎం-హబ్) పేరుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం, నాలెడ్జ్ లీడ్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
సహకారం అడిగారు: ఎం శ్రీనివాసరావు
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేయతలపెట్టిన ఎం-హబ్కు సహాయ సహకారాలు అందించాలని అక్కడి ప్రభుత్వం కోరిందని టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఆరు వారాల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం టీ హబ్ను సందర్శించారని, ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకున్నారని చెప్పారు.
టీ హబ్లో సెమికండక్టర్ స్టార్టప్స్ సక్సెస్
సెమికండక్టర్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అటల్ ఇన్నోవేషన్ సెంటర్ తో కలిసి టీ హబ్లో మొదటి విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో సెమికండక్టర్ రంగానికి ఎంతో మేలు చేసేలా మంచి పనితీరు కనబర్చిన 10 స్టార్టప్లను ప్రత్యేకంగా ఎంపిక చేశామని టీ హబ్ సీఈవో ఎం ఎస్.రావు తెలిపారు. ఈ జాబితాలో వాస్బీమ్, ప్రోటాన్ ప్లస్, వానిక్స్ టెక్నాలజీస్, అంబిట్ సెమికండక్టర్స్, యాన్సర్ రోబోటిక్స్, సిరప్ సొల్యూషన్, ఫాస్మో ఎనర్జీ సిస్టమ్స్, రప్చర్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, గ్రీన్ పీఎంయూ సెమీ, హివ్రిక్ టెక్నాలజీస్లు ఉన్నాయి. ఎంపికైన స్టార్టప్లకు ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రూ.6 కోట్లు సమకూరాయని, మరో రూ.3 కోట్ల చర్చలు జరుగుతున్నాయి.