ముంబై, మే 6: ఇన్ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రోకు చెందిన ఐటీ సబ్సిడరీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్ట్రీలు విలీనం కానున్నాయి. విలీనంతో రెండు కంపెనీల ఆదాయం 3.5 బిలియన్ డాలర్లకు చేరుతుంది. విలీన కంపెనీని ‘ఎల్టీఐమైండ్ట్రీ’గా వ్యవహరించనున్నట్లు శుక్రవారం ఇరు సంస్థలు తెలిపాయి. పూర్తి షేర్ల లావాదేవీగా జరిగే ఈ విలీనంతో మైండ్ట్రీ షేర్హోల్డర్లకు ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు లభిస్తాయి. కొత్తగా జారీఅయ్యే ఎల్టీఐ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ట్రేడవుతాయి. విలీనం తర్వాత ఎల్టీఐమైండ్ట్రీలో ఎల్అండ్టీకి 68.73% వాటా ఉంటుంది. ఇది తమ కస్టమర్లు, ఇన్వెస్టర్లకు లబ్ది చేకూరుస్తుందని ఎల్టీఐ చైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. విలీన సంస్థకు డీసీ ఛటర్జీ నేతృత్వం వహిస్తారు. కాగా, ఎల్టీఐ సీఈవో సంజయ్ జలోనా వ్యక్తిగత కారణాలతో కంపెనీకి రాజీనామా చేశారు.