అమెరికాలో జూలై ద్రవ్యోల్బణం వృద్ధి మార్కెట్ అంచనాలకంటే తక్కువగా 8.5 శాతంగా నమోదుకావడం ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది. దీంతో సెప్టెంబర్ సమీక్షలో ఫెడ్ వడ్డీ రేట్లు భారీగా పెరగవన్న భావనతో గతవారం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. ఈ క్రమంలో 17,724 పాయింట్ల గరిష్ఠస్థాయివరకూ పెరిగిన నిఫ్టీ వారం మొత్తంమీద 301 పాయింట్లు లాభపడి 17,698 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఐదు రోజులూ జరిగిన అప్ట్రెండ్తో అంతక్రితం వారం చార్టుల్లో ఏర్పడిన బేరిష్ సెటప్ తొలగిపోయిందని ఈక్విటీ
రీసెర్చ్ వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ఎస్జీఎక్స్ నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పెరిగి ఉన్నందున, సోమవారం సెలవు అనంతరం మంగళవారం మార్కెట్ గ్యాప్అప్తో మొదలుకావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
17,800 స్థాయి కీలకం
నిఫ్టీ 18,600 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి పతనం చెందిన తర్వాత ప్రతీ పెరుగుదలలోనూ ఫాలింగ్ ట్రెండ్లైన్ ప్యాట్రన్ నిరోధిస్తున్నదని మిలన్ వైష్ణవ్ విశ్లేషించారు. ప్రస్తుతం ఈ ట్రెండ్లైన్ 17,700-17,800 శ్రేణి మధ్య ఉన్నదని, అందుచేత 17,800 స్థాయిని అధిగమిస్తేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుందన్నారు. ఈ వారం 17,800పైన 17,935 పాయింట్ల వరకూ పెరగవచ్చని, దిగువన 17,550, 17,465 పాయింట్ల వద్ద మద్దతు ఉన్నాయన్నారు. మార్కెట్లో మూమెంటం పటిష్టంగా ఉన్నా, రెలిటివ్ స్ట్రెంత్ ఇండికేటర్లో బేరిష్ డైవర్జన్స్ కన్పిస్తున్నదని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ తెలిపారు. దీంతో 17,800 వద్దనున్న తక్షణ నిరోధస్థాయిని దాటడం కీలకమని, 17,600 సమీపంలో ఉన్న మద్దతును కోల్పోతే ట్రెండ్ బలహీనపడవచ్చని అంచనా వేశారు.