న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ద్విచక్ర వాహన మార్కెట్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రముఖ ఆటో రంగ సంస్థ ఎల్ఎంఎల్.. విద్యుత్తు ఆధారిత వాహనాల ఉత్పత్తితో రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి పనులపైనా దృష్టి సారించిందీ కాన్పూర్ ఆధారిత కంపెనీ. భాగస్వాముల సాయంతో భారీ పెట్టుబడులతో ఎల్ఎంఎల్ బ్రాండ్ను మళ్లీ మార్కెట్లోకి కొత్తగా తీసుకురావాలని భావిస్తున్నది. ‘మార్కెట్లోకి మళ్లీ రావడానికి కసరత్తు చేస్తున్నాం. అన్ని వర్గాలను ఆకర్షించే వాహనాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం’ అని బుధవారం ఓ ప్రకటనలో ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ఎండీ, సీఈవో యోగేశ్ భాటియా అన్నారు. ఇటలీకి చెందిన పియాజియో వెస్పా సాంకేతిక సహకారంతో 1983లో 100 సీసీ స్కూటర్ల తయారీని ఎల్ఎంఎల్ ప్రారంభించింది. అయితే 1999 లో పియాజియోతో భాగస్వామ్యాన్ని తెంచుకున్న ఎల్ఎంఎల్.. 2006లో తమ కాన్పూర్ ప్లాంట్ ను లాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎల్ఎంఎల్ వెస్పా విశేష జనాదరణను పొందిన సంగతీ విదితమే.