న్యూఢిల్లీ, జూన్ 28: గతవారం పబ్లిక్ ఇష్యూలు జారీచేసిన రెండు హైదరాబాద్ కంపెనీలు సోమవారం భారీ ప్రీమియంతో లిస్టయ్యాయి. 45 రెట్లకుపైగా ఓవర్సబ్స్క్రయిబ్ అయిన దొడ్ల డెయిరీ ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.428)తో పోలిస్తే 28 శాతం అధికంగా రూ.550 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 52 శాతం వరకూ పెరిగిన ఈ షేరు రూ.652 వద్ద గరిష్ఠస్థాయిని నమోదుచేసింది. అటుతర్వాత లాభాల స్వీకరణతో ఆ స్థాయి నుంచి కొంతమేర లాభాల్ని కోల్పోయినప్పటికీ, ఇష్యూ ధరకంటే 42 శాతం ప్రీమియంతో రూ.610 వద్ద ముగిసింది. మరో హైదరాబాద్ కంపెనీ కిమ్స్ ఇష్యూ ధర రూ.825కంటే 22 శాతం ప్రీమియంతో రూ. 1,009 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 28 శాతం పెరిగి రూ.1,059 వద్ద గరిష్ఠస్థాయిని చేరింది. చివరకు రూ. 987 వద్ద క్లోజయ్యింది. ఈ షేరు బీఎస్ఈలో రూ. 995 వద్ద ముగిసింది. కిమ్స్ ఐపీఓ దాదాపు 4 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది.