ఏటా పెన్షన్ను తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ (పీడీఏ)కి తమ జీవన్ ప్రమాణ్ లేదా వార్షిక జీవన ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. పెన్షనర్ జీవించే ఉన్నాడన్నదానికి ఈ లైఫ్ సర్టిఫికెట్ ప్రూఫ్ తప్పనిసరి. ప్రతీ సంవత్సరం నవంబర్ 1 నుంచి ఈ సర్టిఫికెట్లను పెన్షనర్లు సమర్పిస్తూ ఉంటారు. కాగా, 80 ఏండ్లు, ఆపై వయసున్నవారికి అక్టోబర్ 1 నుంచే సర్టిఫికెట్లు సమర్పించేలా కేంద్రం వెసులుబాటునూ ఇచ్చింది. ఇక బ్యాంకులు, పోస్టాఫీసులు, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వంటి పెన్షన్ పంపిణీ కేంద్రాలకు వెళ్లి నేరుగా లైఫ్ సర్టిఫికెట్ ప్రూఫ్లను పెన్షనర్లు సమర్పించవచ్చు. లేదా డిజిటల్ పద్ధతిలోనైనా అందజేయవచ్చు.
డిజిటల్ విధానంలో..
సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (సీపీఐవో) మార్గనిర్దేశకాల ప్రకారం పెన్షనర్లు తమ వార్షిక లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో సమర్పించడానికి జీవన్ ప్రమాణ్ పోర్టల్ను సందర్శించవచ్చు. అయితే ఈ పద్ధతిలో పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యూఐడీఏఐ ఆధారిత డివైజెస్ ద్వారా బయోమెట్రిక్స్ను అందించాలి. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను అందుకోవడానికి మొబైల్లో అప్పటికప్పుడు పెన్షనర్లు తమ ఫోటోను తీసి జీవన్ ప్రమాణ్ యాప్పై అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇతర పద్ధతుల్లో..
కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కలిసి 2020లో పోస్ట్మ్యాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించడం కోసం ఓ డోర్స్టెప్ సర్వీస్ను అందుబాటులోకి తెచ్చాయి. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి పోస్ట్ఇన్ఫో యాప్ను పెన్షనర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.