న్యూఢిల్లీ, నవంబర్ 22: ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన బిలియనీర్ వాణిజ్య వేత్త గౌతమ్ అదానీ గ్రూప్లో ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) భారీగా పెట్టుబడి చేస్తున్నది. ఈ గ్రూప్ కంపెనీల్లో ప్రస్తుతం ఎల్ఐసీకి ఉన్న పెట్టుబడుల విలువ రూ.87,380 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఉన్న రూ.32,100 కోట్ల పెట్టుబడితో పోలిస్తే ఇప్పుడు అదానీ గ్రూప్లో ఎల్ఐసీ వాటా మూడింతలైంది. దేశంలో ఉన్న మొత్తం మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అదానీ కంపెనీల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్కంటే జీవిత బీమా దిగ్గజం పెట్టుబడులు 4.9 రెట్లు అధికం. వచ్చే దశాబ్దకాలంలో వ్యాపారాన్ని మరింతగా విస్తరించి, గ్రూప్ విలువను 1 ట్రిలియన్ డాలర్లకు (రూ.81.7 లక్షల కోట్లు) పెంచుకోవాలని తపన పడుతున్న గౌతమ్ అదానీకి స్వయానా ప్రభుత్వ రంగ సంస్థే పెట్టుబడుల ద్వారా భారీ మద్దతును అందిస్తున్నది. దశాబ్దాలుగా వాణిజ్య దిగ్గజాలుగా నిరూపించుకుంటున్న టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఎల్ఐసీ అత్యధికంగా అదానీ గ్రూప్లోనే పెట్టుబడి పెట్టింది. ట్రేడింగ్ కంపెనీగా నడిచే అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాతే వెలుగులోకి వచ్చిన సంగతి గమనార్హం. ఆ గ్రూప్ రేవులు, విమానాశ్రాయాలు, విద్యుత్ ప్రాజెక్టుల్ని వరుసపెట్టి టేకోవర్ చేస్తూ ఏడు లిస్టెడ్ కంపెనీలుగా విస్తరించిన విషయం తెలిసిందే.
ఐదు కంపెనీల్లో భారీ పెట్టుబడులు
రెండేండ్ల నుంచి ఎల్ఐసీ మొత్తం ఏడు అదానీ లిస్టెడ్ కంపెనీల్లో ఐదు కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో కొంటున్నది. ఈ కొనుగోళ్ల ప్రభావంతో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీలో బీమా సంస్థ వాటా 10 శాతాన్ని మించిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్లో ఎల్ఐసీ వాటా ఏడాది క్రితం 2.22 శాతం ఉండగా, ఇప్పుడది 4.02 శాతానికి చేరింది. అదానీ టోటల్ గ్యాస్లో వాటాను 3.58 శాతం నుంచి 5.77 శాతానికి పెంచుకుంది. అదానీ ట్రాన్స్మిషన్లో వాటా 2.42 శాతం నుంచి 3.46 శాతానికి చేరింది. కొత్తగా రంగంలోకి దిగిన అదానీ గ్రీన్లో సైతం ఎల్ఐసీకి 1.15 శాతం వాటా ఉంది. ఇటీవల అదానీ గ్రూప్ టేకోవర్ చేసిన అంబూజా సిమెంట్స్ (అదానీ సిమెంట్స్)లోనూ, ఏసీసీలోనూ కూడా ఎల్ఐసీ పెట్టుబడులు ఉన్నాయి.
విదేశీయులు ఎగ్జిట్.. ఎల్ఐసీ ఎంట్రీ
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లను విక్రయిస్తుంటే ఎల్ఐసీ కొనుగోలు చేస్తున్నది. అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెడుతున్న పెట్టుబడులపై మార్కెట్లోనూ, రాజకీయ వేదికల్లోనూ చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఒక గ్రూప్ కంపెనీలో కొంత వాటాను తగ్గించుకుంది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో తమకున్న వాటాను 24,01,47,873 ఈక్విటీ షేర్ల నుంచి 19,75,26,194 షేర్లకు తగ్గించుకున్నట్లు స్టాక్ ఎక్సేంజీలకు ఎల్ఐసీ గతవారం సమాచారం అందించింది. ఈ కంపెనీ చెల్లింపు మూలధనంలో ఎల్ఐసీ వాటా 11.36 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గింది.
ఖరీదైన షేర్లపై ఎల్ఐసీకి ఎందుకు మక్కువ?
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి పోటీ వ్యాపార కంపెనీలతో పోలిస్తే అత్యధిక విలువపై ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు విద్యుదుత్పాక సంస్థ అదానీ గ్రీన్ లాభంతో పోలిస్తే షేరు ధర (పీఈ, ప్రైస్ టు ఎర్నింగ్స్) 1,109 రెట్లు ఉంది. అదే టాటా పవర్ పీఈ 47 రెట్లు. అదానీ టోటల్ పీఈ 473 కాగా, ఇంద్రప్రస్థ గ్యాస్ పీఈ 18. అదానీ గ్రూప్ షేరు విలువలను వాటి ఫండమెంటల్స్ రీత్యా అనూహ్యమైనవని, కొనదగ్గవి కాదని ఫండ్ మేనేజర్లు అంతర్గత చర్చల్లో చెపుతుంటారు. ఏ విధంగానూ ఈ షేరు విలువలు అంగీకారయోగ్యం కాదంటూ ఒక టాప్ మ్యూచువల్ ఫండ్కు చెందిన ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఇంత భారీగా ఇవే షేర్లలో ఫండ్స్ పెట్టుబడి చేయబోవు. ప్రభుత్వ రంగ పోటీ సంస్థలైన సిటిగ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఇంద్రప్రస్థ గ్యాస్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిటర్ పవర్గ్రిడ్ తక్కువ విలువలకే లభిస్తున్నపుడు, అధిక విలువలతో ట్రేడవుతున్న అదానీ షేర్లలో ఎల్ఐసీ ఎందుకు భారీగా పెట్టుబడి చేస్తున్నతీరు మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తున్నది. ఇప్పటివరకూ ప్రసిద్ధ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశీ మ్యూచువల్ ఫండ్స్కు అదానీ గ్రూప్లో పెట్టుబడులు నామమాత్రమే.