LIC IPO | పెట్టుబడుల ఉపసంహరణ విషయమై కేంద్ర ప్రభుత్వం లక్ష్యాల సాధన దిశగా అడుగులేస్తున్నట్లే కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తొలి విడుత పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఎల్ఐసీ ఐపీవోకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నది కేంద్రం. ఇందుకు అనుమతి కోరుతూ దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఎల్ఐసీ దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది.
వచ్చే నెలలో ఐపీఓకి అనుమతి కోసం ప్రాథమిక పత్రాలను మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి దరఖాస్తు సమర్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆర్థికశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఎల్ఐసీలో ఐపీవోను ఈ ఆర్థిక సంవత్సరంలోనే తేవాలన్న లక్ష్యం తమ ముందుందన్నారు. అందుకు నిర్దిష్ట కాలపరిమితులూ ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే నవంబరులో సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నామని ఆ అధికారి వివరించారు.
ఎల్ఐసీని ఐపీవోలోకి తీసుకెళ్లేందుకు సంస్థలో నిబంధనలు మార్పులు ఇప్పటికే జరిగాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి వీలుగా ఎల్ఐసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనున్నది కేంద్ర ప్రభుత్వం. దీంతోపాటు ఎల్ఐసీ ఛైర్మన్ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించింది. ప్రస్తుతం ఉన్న 60 ఏండ్లకు బదులు 62 ఏండ్లకు పెంచివేసింది.
మరోవైపు ఎల్ఐసీలో ఐపీఓ నిర్వహణకు 10 మర్చంట్ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎంపిక చేసింది. ఇందులో గోల్డ్మన్ శాక్స్, సిటీ గ్రూప్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ క్యాప్స్ ఉన్నాయి. మిగతా బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, నొమురా, బోఫా సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ను న్యాయ సలహాదారుగా నియమించింది కేంద్రం.
మరోవైపు విదేశీ మదుపర్లకూ ఐపీఓలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. సెబీ నిబంధనల ప్రకారం.. విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు( ఎఫ్పీఐ) ఐపీఓ ద్వారా షేర్లు కొనేందుకు అర్హులు. కానీ ఎల్ఐసీ చట్టంలో మాత్రం విదేశీ పెట్టుబడులకు అనుమతి లేదు.