LIC IPO | ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అడుగు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అయితే, ఐపీవోలో పాలసీదారులకు 10 శాతం వాటాలను రిజర్వు చేసింది. ఈ ఐపీవోలో బిడ్ దాఖలు చేసే పాలసీ దారులు తమ పాన్ కార్డ్ను పాలసీతో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు డీమ్యాట్ ఖాతా కూడా తెరువాలి. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎల్ఐసీ ఈ నెల 13న దాఖలు చేసిన ముసాయిదా పత్రాల ప్రకారం కేంద్రం రూ.68 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఐదు శాతం వాటా.. అంటే 31.6 కోట్ల షేర్లు ప్రభుత్వం విక్రయించనున్నది. వచ్చేనెలలో స్టాక్ మార్కెట్లను తాకే ఎల్ఐసీ ఐపీవోలో ఉద్యోగులు, పాలసీదారులు రాయితీపై షేర్ల కోసం బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
అయితే, సెబీ వద్ద ఎల్ఐసీ.. డీఆర్హెచ్పీ దాఖలు చేసిన రెండు వారాల్లోపు పాలసీదారులు తమ పాన్ నంబర్ అప్డేట్ చేయించుకోవాలి. ఆలోగా డీమ్యాట్ ఖాతా కూడా తెరువాల్సి ఉంటుంది. పాలసీదారులు నేరుగా సంస్థ వెబ్సైట్ ద్వారా గానీ, ఏజంట్ల ద్వారాగానీ పాన్ కార్డు వివరాలు సమర్పించాలని తెలిపింది.
పాలసీదారుల్లో భారత్లో నివాసం ఉండేవారు మాత్రమే ఐపీవో ఆఫర్లో పాల్గొనేందుకు అర్హులు. ఎల్ఐసీలోని 632.49 కోట్లకు పైగా షేర్లలో 100 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదే. ఎల్ఐసీలో ఫ్రెష్గా షేర్లు జారీ చేయడం లేదు. ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా మాత్రమే వాటాలను కేంద్రం విక్రయిస్తున్నది. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.10 ఉండొచ్చు. భారత దేశ స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ ఐపీవో అతిపెద్దది కానున్నది. ఒక్కసారి ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ లిస్ట్ అయితే, బ్లూచిప్ కంపెనీలు రిలయన్స్, టీసీఎస్తో సమానంగా మార్కెట్ క్యాపిటలైజేసన్ కలిగి ఉంటుంది. వచ్చేనెలలో ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లను తాకుతుందని అంచనా వేస్తున్నారు.