LIC IPO | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు అద్భుతమైన స్పందన కనిపించింది. తొలిరోజు పెద్దగా బిడ్లు దాఖలు కాకున్నా.. చివరి రోజు సోమవారం ఇన్వెస్టర్లు, పాలసీ హోల్డర్లు, సంస్థ ఉద్యోగులు పోటీ పడ్డారు. ఈ నెల నాలుగో తేదీన మొదలై సోమవారం ముగిసిన ఎల్ఐసీ ఐపీవోకు దాదాపు మూడు రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. 16.20 కోట్ల షేర్లకు బిడ్లు ఆహ్వానిస్తే 47.83 కోట్లు అంటే 2.95 శాతం ఎక్కువగా బిడ్లు వచ్చాయి.
గరిష్టంగా పాలసీ హోల్డర్లు 6.11 రెట్లు, కనిష్టంగా రిటైల్ ఇన్వెస్టర్లు 1.99 రెట్లు బిడ్లు దాఖలు చేశారు. క్వాలిఫైడ్ ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్ల (అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లు)లో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 2.91, ఉద్యోగుల్లో 4.40 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. తొలిరోజు అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. చివరి రోజు కూడా కోటాకు సరిపడా బిడ్లు నమోదు కాలేదని ఎక్స్చేంజ్ల్లో ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తున్నది.
సంస్థాగతేతర ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ) విభాగంలో మొదటి మూడు రోజులు అంతంత మాత్రంగానే బిడ్లు రిజిస్టరయ్యాయి. చివరి రోజు మాత్రం 2.91 రెట్లు ఎక్కువ బిడ్లు రికార్డయ్యాయి. ఈ నెల 16న బిడ్ గెలుచుకున్న వారి ఖాతాల్లోకి షేర్లు బదిలీ అవుతాయి. ఈ నెల 17న స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఎల్ఐసీ లిస్టింగ్ అవుతుంది.