న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇష్యూ జారీచేసే సమయంపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. కేవలం దేశీ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ ఆధారంగా ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్తో ముందుకెళ్లాలా లేక అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్లోకి వచ్చేంతవరకూ వేచిచూడాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడం కష్టసాధ్యంగా ఉందని ఆ అధికారి వివరించారు. వాస్తవానికి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను మార్చి నెలలోనే తెచ్చేందుకు ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమయ్యింది. అయితే హఠాత్తుగా తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతలతో ఇష్యూను వెనక్కు జరిపారు.
మే 12వరకూ గడువు
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈ ఫిబ్రవరిలో ఇచ్చిన అనుమతి ప్రకారం ఎల్ఐసీ ఐపీవోను తీసుకొచ్చేందుకు మే 12 వరకూ ప్రభుత్వానికి గడువు ఉన్నది. ఆ తేదీ దాటితే మళ్లీ సెబీకి తాజాగా ఆఫర్ డాక్యుమెంట్లను సమర్పించి, తిరిగి అనుమతి పొందాల్సి వస్తుంది. ఐపీవోను ఇప్పుడు జారీచేయకపోతే, ఆగస్టు-సెప్టెంబర్ వరకూ వాయిదా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్రైమాసిక ఫలితాల్ని, విలువల్ని అప్డేట్ చేసి తాజా పత్రాల్ని సెబీకి సమర్పించాల్సి ఉంటుందని, వాటిని పరిశీలించి రెగ్యులేటర్ ఆమోదం తెలపడానికి మరికొంత సమయం పడుతుందని వారు వివరించారు. మే 12కల్లా ఆఫర్ను తేవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటే, ఇష్యూ ధర తదితర వివరాలతో రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ను వచ్చే వారంలో సెబీకి ఫైల్ చేయాల్సి ఉంటుంది.
లిస్టింగ్ రోజునే లాభపడాలి
ఎల్ఐసీలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించాలని ప్రభుత్వం తొలుత ప్రతిపాదించింది. రోడ్షోల్లో లభించే స్పందన ఆధారంగా దీనిని 7 శాతానికి పెంచాలన్న ఆలోచన కూడా చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్ని చూస్తుంటే 5 శాతానికి మించి వాటా విక్రయం సాధ్యంకాదని ప్రభుత్వ అధికారి అభిప్రాయపడ్డారు. అలాగే ఆఫర్ విలువను కూడా తగ్గించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ వాల్యుయర్లు నిర్దేశించిన రూ.5.4 లక్షల కోట్ల ఎంబడెడ్ విలువకు 3 రెట్లు అధికంగా దాదాపు రూ. 16 లక్షల కోట్ల విలువను సంస్థకు ఆపాదించి, ఐపీవోను తేవాలని మార్చిలో ప్రతిపాదించారు. ఎల్ఐసీ చాలా పెద్ద సంస్థ అయినందున, ఎంబడెడ్ విలువకు అన్ని రెట్లు అధికంగా ఎక్కువచేసి మార్కెట్ విలువను ఆపాదించడం కరెక్ట్ కాదని ఇప్పుడు అభిప్రాయపడుతున్నట్లు ఆ అధికారి వివరించారు. ఎల్ఐసీ షేరు లిస్టింగ్ రోజునే పెరిగి ఇన్వెస్టర్లకు లాభాలను ఇచ్చే రీతిలో ఐపీవో ధరను నిర్ణయించడం జరుగుతుందన్నారు.