న్యూఢిల్లీ, ఆగస్టు 3: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చ్యూన్ 500 జాబితాలోకి ప్రవేశించింది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ఎల్ఐసీ తాజాగా విడుదలైన ఫార్చ్యూన్ 500 జాబితాలో 98వ స్థానాన్ని దక్కించుకుంది. అమ్మకాల ఆదాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు.
2022 సంవత్సరానికి విడుదల చేసిన ఈ లిస్ట్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏకంగా 51 స్థానాల్ని మెరుగుపర్చుకుని 104వ స్థానానికి ఎగబాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ముగిసిన ఏడాది ఆదాయం 93.98 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ గత 19 సంవత్సరాలుగా ఫార్చ్యూన్ 500 జాబితాలో కొనసాగుతున్నది. అమెరికా రిటైల్ కంపెనీ వాల్మార్క్ అగ్రస్థానంలో ఉన్న ఈ లిస్ట్లో 9 భారతీయ కంపెనీలున్నాయి.
ఇందులో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలుకాగా, నాలుగు ప్రైవేట్ రంగ కంపెనీలు. గత ఏడాదే ఐపీవో జారీచేసిన ఎల్ఐసీ..రిలయన్స్కంటే పై స్థానంలోకి ప్రవేశించడం గమనార్హం. ఇందులో టాటా గ్రూప్ కంపెనీలు రెండు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎస్బీఐలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాటి స్థానాల్ని మెరుగుపర్చుకున్నాయి.
ఈ జాబితాలోని మొత్తం కంపెనీల అమ్మకాల టర్నోవర్ నిరుడుకంటే 19 శాతం వృద్ధిచెంది 37.8 ట్రిలియన్ డాలర్లకు చేరిందని ఫార్చూన్ తెలిపింది. వాల్మార్ట్ వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో కొనసాగగా, రెండోస్థానంలో అమెజాన్ ఉంది. చైనా ఇంధన కంపెనీలు స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం, సినోపెక్లు 3,4,5 స్థానాల్లో ఉన్నాయి. జాబితాలోని మొత్తం అమెరికా కంపెనీల టర్నోవర్కంటే చైనా కంపెనీల ఆదాయం తొలిసారిగా అధికంగా నమోదయ్యిందని ఫార్చూన్ వివరించింది.