ముంబై, అక్టోబర్ 21: ఆస్తులు తాకట్టుపెట్టుకొని రుణాలు అందించే ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.247.86 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.790.90 కోట్ల లాభంతో పోలిస్తే 68.66 శాతం గండిపడింది. నిరర్థక ఆస్తులు పూడ్చుకోవడానికి అధికంగా నిధులు కేటాయించడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. గత త్రైమాసికంలో మొండి బకాయిలను ఒకేసారి రుణ పునర్వ్యవస్థీకరణ కోసం రూ.600 కోట్లు నిధులు వెచ్చించడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థ రూ.16,110 కోట్ల నిధులను రుణాల రూపంలో మంజూరు చేసింది. ఏడాది క్రితం చేసిన రూ.12,443 కోట్లతో పోలిస్తే 29 శాతం అధికం. వీటిలో గృహ రుణాలు రూ.14,330 కోట్లు కాగా, ప్రాజెక్టు రుణాల కింద రూ.353 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం సంస్థ రూ.2,37,660 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,238 కోట్ల నుంచి రూ.1,173 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ఒక్క శాతం పెరిగి రూ.440.35 వద్ద నిలిచింది.