న్యూఢిల్లీ, జనవరి 5: హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి. 2010 తర్వాత ఒక్క ఏడాదిలోనే ఈ స్థాయి గృహ విక్రయాలు జరుగడం ఇదే తొలిసారి అని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ తమ తాజా నివేదికలో తెలిపింది. 2010లో 2,16,762 ఇండ్లు అమ్ముడయ్యాయి. గృహ రుణాలపై వడ్డీరేట్లు పెరిగినా హౌజింగ్ సేల్స్ ప్రభావితం కాలేదని పేర్కొన్నది.
హైదరాబాద్లో గత ఏడాది హౌజింగ్ సేల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని జేఎల్ఎల్ వెల్లడించింది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, ముంబై, పుణెల్లో 2008 తర్వాత తిరిగి 2022లోనే అత్యధికంగా గృహ విక్రయాలు జరిగినట్టు చెప్పింది. కాగా, 2021తో చూస్తే 2022లో ఇండ్ల అమ్మకాలు 68 శాతం పుంజుకున్నాయి. నిజానికి ఈ రెండేండ్లు కరోనా ప్రభావం ఉన్నా.. రియల్టీ మార్కెట్ ఉనికిని కోల్పోలేదన్నది.
ఆఫీస్ లీజింగ్లో నిరుడు దేశీయ కంపెనీల హవా స్పష్టంగా కనిపించింది. ఏటా విదేశీ సంస్థలు.. ముఖ్యంగా అమెరికా కార్పొరేట్లే భారత్లో ఆఫీస్ లీజుల్లో ముందుంటారు. కానీ 2022లో దేశీయ సంస్థలదే పైచేయి. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 2021తో చూస్తే గత ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ 40 శాతం ఎగిసింది. 40.5 మిలియన్ చదరపు అడుగుల నుంచి 56.6 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఇందులో 27.73 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని భారతీయ సంస్థలే లీజుకు తీసుకున్నాయి. ఇదే తొలిసారి అని సీబీఆర్ఈ తెలియజేసింది.