KTR | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టెస్లా బృందాన్ని ఆహ్వానించి, ఇక్కడి ప్రగతిశీల పారిశ్రామిక విధానాలపై వారికి అవగాహన కల్పించాలని ఎక్స్ వేదికగా సూచించారు. టెస్లా కంపెనీ భారత్లో రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చిందని, ఇందుకు దేశంలో సరైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లాను హైదరాబాద్కు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక అనుకూల విధానాలతో పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఏర్పాటుకూ రాష్ట్రంలో తగిన ఎకోసిస్టం ఉన్నదని పేర్కొన్నారు. అమరరాజా కంపెనీ మహబూబ్నగర్ జిల్లాలో భారీ స్థాయిలో బ్యాటరీల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నదని, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ట్రాక్టర్లు, కమర్షియల్ వాహనాల తయారీ పరిశ్రమను జహీరాబాద్లో నిర్వహిస్తున్నదని, అదే ప్రాంతంలో హ్యుందాయ్ కంపెనీ రూ.1,400 కోట్ల పెట్టుబడితో టెస్టింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో టెస్లా వంటి కంపెనీ రాకతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రయత్నిస్తున్నాం: మంత్రి శ్రీధర్బాబు
టెస్లా కంపెనీని రాష్ర్టానికి రప్పించేందుకు గత డిసెంబర్ నుంచే ప్రయత్నిస్తున్నామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఎక్స్ వేదికగా తెలిపారు. అధికార యంత్రాంగం టెస్లా ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నదని ఆయన వెల్లడించారు. ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సులభతర అనుమతుల విధానం తదితర అనుకూలతలు తెలంగాణకు ఉన్నాయని, ఇవి టెస్లాసహా దిగ్గజ కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంటాయని ఎక్స్ వేదికలో పేర్కొన్నారు.
జర్మనీనుంచి దిగుమతులు..
కాగా, ఈ ఏడాది ఆఖరుకల్లా భారత్కు ఎగుమతి చేసేందుకు జర్మనీలో కార్ల తయారీని టెస్లా ప్రారంభించింది. నిజానికి దేశీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను ఎప్పట్నుం చో అందిపుచ్చుకోవాలని చూస్తున్న టెస్లా.. కేంద్ర ప్రభుత్వ వైఖరితో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మోదీ సర్కారు మెత్తబడి, సరళతర విధానాలను తీసుకువచ్చిన నేపథ్యంలో టెస్లా దూకుడు పెంచింది. ఇక్కడే ప్లాంట్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నదిప్పుడు.