న్యూఢిల్లీ, జూన్ 20: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియాకి చెందిన ఎస్యూవీ సోనెట్ రికార్డు స్థాయిలో అమ్ముడైంది. సెప్టెంబర్ 2020లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 1.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీ మొత్తం విక్రయాల్లో సోనెట్ వాటా 32 శాతంగా ఉన్నదని, అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఎస్యూవీ విభాగంలో 15 శాతం వాటా కలిగివుండటం విశేషం. డిజైనింగ్, పనితీరు, మైలేజీ అత్యధికంగా ఇవ్వడంతో కస్టమర్లు ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారని పేర్కొంది. భద్రత ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఇటీవల సంస్థ ఈ మోడల్లో నాలుగు ఎయిర్బ్యాగ్లను నెలకొల్పింది.