UPI Payments : యూపీఐ సేవల్ని మరింత ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. ఈ నెలలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని సేవలు అందుబాటులోకి రాగా.. మరికొన్ని సేవలు ప్రారంభమవుతాయి. వెరిఫికేషన్ ప్రమాణాలు పెంచుతూ, వినియోగదారులకు మరింత ఉపయోగపడేలా, మరింత పారదర్శకంగా ఈ మార్పులు ఉంటాయి. ఇకపై లావాదేవీలు త్వరగా, సురక్షితంగా పూర్తవుతాయి.
కొత్త రూల్ ప్రకారం యూపీఐ లావాదేవీ జరిపినప్పుడు ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) వేగంగా స్పందించాలి. అంటే ఒక ట్రాన్సాక్షన్ 10 సెకండ్లలో పూర్తవ్వాలి. ఇంతకుముందు ఈ సమయం 30 సెకండ్లు ఉండేది. త్వరగా ట్రాన్సాక్షన్ పూర్తైతే వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది. పీక్ టైంలో కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. యూజర్ల వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా భారీ ట్రాన్సాక్షన్స్ త్వరగా, సురక్షితంగా చేసుకోవచ్చు. పేమెంట్ చేసేముందు స్పష్టమైన అంగీకారం తెలపాలి. అలాగే ఆటో డెడక్షన్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా చాలాకాలం నుంచి వాడకుండా ఉన్న యూపీఐ ఐడీలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. వీటిని మళ్లీ వాడుకోవాలంటే రీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దీనివల్ల అలాంటి అకౌంట్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయి. ఇక చాలా మంది ఎదుర్కొనే సమస్య.. పేమెంట్ ఫెయిల్ అవ్వడం. అంటే యూజర్ల అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.
కానీ, పేమెంట్ అవ్వదు. ఇలాంటి విషయంలో డబ్బు రీఫండ్ అవ్వాలన్నా.. సమస్య పరిష్కారం కావాలన్నా కొన్నిసార్లు మూడు రోజులు, ఆపై వారం రోజులు కూడా పట్టేది. ఇకపై గంటల్లోనే ఈ సమస్య పరిష్కారం కావాలి. యూపీఐ యాప్స్ లేదా బ్యాంకులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వేరే యూజర్ల నుంచి డబ్బు సెండ్ చేయమని అడిగే ప్రక్రియ ఇకపై కఠినతరం కానుంది. యూపీఐ యూజర్లు రిక్వెస్ట్ పంపించే సంఖ్య తగ్గుతుంది.