హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బ్యాంకులను కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) మోసం చేసిన కేసులో సీసీఎస్ పోలీసులు చేస్తున్న దర్యాప్తులో కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్వీ సృష్టించిన 9 డొల్ల కంపెనీలకు డైరెక్టర్లు అంతా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులేనని తేలింది. డైరెక్టర్లుగా ఉన్నవారి చిరునామాలు అన్నీ కార్వీతోనే ఉన్నాయి. వీరి బ్యాంక్ ఖాతాలు కూడా కార్వీ పేరుతోనే ఉండటంతో అసలు ఆ ఉద్యోగులకు ఈ విషయం తెలిసి జరిగిందా?.. లేదా?.. అన్నదానిపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. వాళ్లకు తెలియకుండానే వారి ధ్రువపత్రాలతో డైరెక్టర్లుగా చూపిస్తూ నకిలీ కంపెనీలను నమోదు చేయించారా?.. అసలు ఏం జరిగిందన్న కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల అరస్టైన కార్వీ సీఈవో రాజీవ్ రంజన్ సింగ్ కూడా ఐదింటిలో డైరెక్టర్గా ఉన్నట్లు విచారణలో తేలింది. అక్రమంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని ఆయా కంపెనీలలోకి బదిలీ చేయడమేగాక, కంపెనీల డైరెక్టర్లనూ ఇష్టానుసారంగా పెట్టుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్ మోసం కేసులో..
ఐసీఐసీఐ బ్యాంకును రూ.563 కోట్లు మోసం చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కార్వీ చైర్మన్ పార్థసారధిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్థసారధిపై సీసీఎస్లో నమోదైన మూడు కేసులలో సమాంతరంగా దర్యాప్తు జరుగుతున్నది. మరోవైపు సీఈవో రాజీవ్ రంజన్తోపాటు కంపెనీ సీఎఫ్వో కృష్ణ హరి, కార్యదర్శి శైలజను హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ల చీటింగ్ కేసుల్లో కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
రంగంలోకి ఈడీ
కార్వీ అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. సంస్థలో రెండంచెల అక్రమాలు జరిగాయని హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా చైర్మన్ పార్థసారధితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు పంపారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో జైలులో పార్థసారథి స్టేట్మెంట్ను ఈడీ అధికారులు సోమవారం రికార్డు చేసినట్టు సమాచారం. కాగా, స్టాక్ మార్కెట్ లావాదేవీల నిర్వహణ పేరిట కార్వీ.. హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకున్నది. దీంతో ఈ నిధులను ఎక్కడికి మళ్లించారన్న దానిపై ఇప్పుడు ఈడీ దృష్టి సారించింది.