హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో తప్పిదం వల్లే పంప్హౌజ్లు మునిగిపోయాయనడం అబద్ధమని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అన్నారు. ఊహించని స్థాయిలో వచ్చిన వరదల వల్లే పంప్హౌస్లు మునిగిపోయాయని స్పష్టంచేశారు. ఇందులో ఇంజినీరింగ్ అధికారుల వైఫల్యం ఎంతమాత్రం లేదని, ఫ్లడ్ మేనేజ్మెంట్పై ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉన్నారని వివరించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బుధవారం ప్రాజెక్టుల భద్రతా అంశాలపై జలసౌధలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో రజత్కుమార్ సమీక్షించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు ఎస్సారెస్పీ నుంచి భద్రాచలం వరకు వరద ప్రభావ ప్రాంతాల గుర్తింపు, చేపట్టాల్సిన రక్షణ చర్యలపై చర్చించారు. అనంతరం ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఈఎన్సీ (అడ్మిన్) అనిల్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ వరదల నియంత్రణకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదని మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. జూన్లోనే ఇరిగేషన్శాఖ జలసౌధలో సెంట్రల్ ఫ్లడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసిందని, డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్ఎస్) ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నదని వెల్లడించారు.
వందేండ్లలో ఒకసారి వచ్చే వరదలు ఈ సారి గోదావరిలో వచ్చాయని, ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదయిందని, భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్లు కూడా వరదను సరిగా అంచనా వేయలేకపోయాయని వివరించారు. అసాధారణ వర్షపాతంతో గోదావరికి ఒక్కసారిగా అన్ని ప్రాంతాల నుంచి వరద పోటెత్తడం వల్లే పంప్హౌస్లు మునిగిపోయాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, ఇతర అన్ని అంశాలను సీడబ్ల్యూసీ, దాని పరిధిలోని 18 డైరెక్టర్లు కూలంకషంగా పరిశీలించి అనుమతులు ఇవ్వడమే డిజైన్ లోపం లేదనడానికి నిదర్శనమని స్పష్టంచేశారు. పంప్హౌస్ల్లోకి చేరిన వరద నీటి తొలగింపునకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అనంతరం నిపుణుల ద్వారా నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. సుమారు రూ.20-25 కోట్ల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని వివరించారు. ఆ ఖర్చును సైతం ఒప్పందం మేరకు ఆయా పంప్హౌస్లను నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీలే చేపడతాయని, ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండబోదని స్పష్టంచేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉంటే 45 రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి పంప్హౌస్లను ఆపరేషన్లోకి తీసుకొస్తామని వెల్లడించారు.
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నదని, సీడబ్ల్యూసీకి అనేక లేఖలు రాసిందని రజత్కుమార్ వెల్లడించారు. అయినప్పటికీ ఏపీ, కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల లక్ష ఎకరాల వరకు ముంపునకు గురవుతుందని, భద్రాచలం, పర్ణశాల వంటి పలు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లనున్నదని వివరించారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే స్పందించాలని, శాస్త్రీయమైన పద్ధతిలో పోలవరం ముంపుపై అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే సీడబ్ల్యూసీకి, కేంద్ర జల్శక్తిశాఖకు మరోసారి లేఖ రాస్తామని
తెలిపారు.
కడెం ప్రాజెక్టుకు వరద తాకిడిపైనా రజత్కుమార్ వివరాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో ముందస్తుగానే ఇరిగేషన్ శాఖలో ప్రత్యేకంగా ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని ఏర్పాటు చేశారని, ఆ విభాగానికి నిధులను సైతం పెద్దమొత్తంలో సమకూర్చారని తెలిపారు. ఫలితంగానే సీజన్కు ముందుగానే కడెంతోపాటు, అనేక ప్రాజెక్టుల, రిజర్వాయర్లు, తూముల మరమ్మతు పనులు పూర్తిచేశామని, గేట్ల పనితీరును పరిశీలించి సరిచేసే అవకాశం ఏర్పడిందని వెల్లడించారు. దీంతో భారీస్థాయిలో వరద వచ్చినా కడెం ప్రాజెక్టును నియంత్రించగలిగామని వెల్లడించారు. కడెం క్యాచ్మెంట్ ఏరియాలో 24 గంటల్లోనే ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదయిందని, 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వెల్లడించారు. ఇది చాలా అరుదని వెల్లడించారు. అదే విధంగా కడెం ప్రాజెక్టు డిశ్చార్జి కెపాసిటీని ఆ మేరకు పెంచే ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టంచేశారు. ఎందుకంటే ఇలాంటి వరద వందేండ్లకు ఒకసారి వస్తుందని, ఈ నేపథ్యంలో ఆ అవసరం కూడా ఉండబోదని తేల్చిచెప్పారు. ప్రాజెక్టు ఎడమవైపు అదనంగా మరిన్ని గేట్లను అమర్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ యాక్ట్లో భాగంగా కడెం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించి చేపట్టాల్సిన భద్రత చర్యలపై అధ్యయనం చేసిందని, ఆ నివేదిక అందిన వెంటనే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.