హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో ‘టాప్-50 ప్రభావశీల బ్రాండ్స్ అండ్ లీడర్స్ జాబితా’ను అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ఏషియా వన్’ విడుదల చేసింది. 2020-21కిగాను వచ్చిన ఈ లిస్టులో హైదరాబాద్కు చెందినవారు ప్రముఖంగా ఉన్నారు. వీరిలో ‘మై హోం’ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు రూ.7,300 కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ‘అపర్ణ కన్స్ట్రక్షన్స్’ సీఎండీ ఎస్ఎస్ రెడ్డి ఉన్నారు. కాగా, డీఎల్ఎఫ్ లిమిటెడ్కు చెందిన రాజీవ్ సింగ్ రూ.42,163 కోట్ల సంపదతో మొత్తం జాబితాలోనే అగ్రస్థానం దక్కించుకున్నారు.
2020-21లో రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోగతి సాధించిన కంపెనీల్లో ఒకటిగా ‘మై హోం కన్స్ట్రక్షన్స్’ నిలిచింది. ఈ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్రావు రూ.7300 కోట్లతో హైదరాబాద్ నగరానికి సంబంధించిన కేటగిరిలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 35 ఏండ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ‘మై హోమ్’ సంస్థ, ఇప్పటి వరకూ 21 రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేసింది.
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగంలో సేవలు అందిస్తున్నది ‘అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ. ఈ కంపెనీ సీఎండీ ఎస్.ఎస్. రెడ్డి రెండో స్థానంలో, డైరెక్టర్ సి.వి.రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నిర్మాణ రంగంలో సరికొత్త అవిష్కరణలతో ప్రాజెక్టులు చేపడుతూ స్థిర వృద్ధితో ‘అపర్ణ కన్స్ట్రక్షన్స్’ ఎదుగుతున్నది. 1996 నుంచి వ్యాపారంలో ఉన్నది.
సమీకృత గృహాల నిర్మాణంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన ‘రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ సంస్థ.. 1994లో ప్రారంభమైంది. గృహ నిర్మాణ రంగంతోపాటు ప్రాజెక్టుల విభాగంలోనూ సేవలు అందిస్తున్నది. ఈ సంస్థ చైర్మన్ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి తాజా జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ రాంకీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్టులు చేపట్టిన అలయన్స్ గ్రూప్ అండ్ అర్బన్రైజ్ సంస్థ.. హైదరాబాద్లోనూ పలు కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. హైదరాబాద్లోని టాప్-5 బిల్డర్లలో ఒకరిగా ఈసారి సంస్థ సీఎండీ మనోజ్ నంబూరుకు గుర్తింపు దక్కింది. ఇదే సంస్థకు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న సునీల్ బొమ్మిరెడ్డి కూడా జాబితాలో ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.