న్యూఢిల్లీ, జూన్ 21: బయోకాన్ బయోలాజిక్స్ నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణపై జాయింట్ డ్రగ్ కంట్రోలర్ ఎస్ ఈశ్వర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. టైప్-1, టైప్-2 డయాబెటిస్ను అదుపులో ఉంచడానికి ఉద్దేశించిన ‘ఇన్సులిన్ యాస్పిరెంట్’ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్ ఫేజ్ 3ని రద్దుచేసేందుకు లంచం తీసుకున్న కేసులో ఈ అరెస్టు జరిగిందని మంగళవారం సీబీఐ అధికారులు తెలిపారు.
ఈశ్వర రెడ్డికి లంచం ఇచ్చారన్న ఆరోపణలపై సినర్జీ నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దినేష్ దువాను కూడా అరెస్టు చేసారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగవచ్చని అధికారులు చెప్పారు. ఢిల్లీలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో)లో ఈశ్వర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. లంచం ఇచ్చిపుచ్చుకుంటున్న సమయంలో ట్రాప్ చేసి వీరిని అరెస్ట్ చేసినట్టు సీబీఐ తెలిపింది. రెడ్డి, దువాలతో పాటు బెంగళూరులోని బయోకాన్ బయోలాజిక్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రవీణ్ కుమార్, బయో ఇన్నోవెట్ రీసెర్చ్ సర్వీసెస్ డైరెక్టర్ గుల్జీత్ సేథి, అసిస్టెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనిమేష్ కుమార్లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ.
విదేశాల్లో ట్రయల్స్ జరిపాం
ఎస్పార్ట్పై అమెరికా, జర్మనీల్లో ఫేజ్-1, ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించామని, ఈ ఫలితాల ఆధారంగానే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, హెల్త్ కెనడాలు ఎస్పార్ట్ మార్కెటింగ్ను అనుమతించాయని, అదే విధంగా దీనిని ఇండియాకు దిగుమతి చేసుకుని, మార్కెట్ చేసేందుకు ఫేజ్-3 ట్రయల్స్ రద్దును కోరినట్టు బయోకాన్ వివరించింది. ఇండియాలో ఫేజ్-4 ట్రయల్స్ నిర్వహించే షరతుపై ఫేజ్ 3 రద్దుకు రెగ్యులేటర్కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు చేసిందని వెల్లడించింది. కంపెనీపైన, ఉత్పత్తుల అనుమతి ప్రక్రియతో సంబంధం ఉన్న తమ అధికారులపైన వస్తున్న ముడుపుల ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది.
డాటా ఆధారంగానే అనుమతులు: బయోకాన్
కిరణ్ మజుందార్ షా నేతృత్వంలోని బయోకాన్కు బయోకాన్ బయోలాజిక్స్ సబ్సిడరీ సంస్థ. లంచం ఇచ్చారన్న ఆరోపణల్ని బయోకాన్ బయోలాజిక్స్ ప్రతినిధి ఒకరు ఖండిస్తూ తమ ఉత్పత్తుల అనుమతులన్నీ చట్టబద్దమైనవని, సైన్స్, క్లినికల్ డాటా ఆధారంగా జరిగినవని తెలిపారు. తమ బీఎస్పార్ట్ యూరప్, పలు ఇతర దేశాల్లో ఆమోదం పొందిందన్నారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించిన తమ ఉత్పత్తులన్నింటికీ నియంత్రణాపరమైన ప్రక్రియను అనుసరించామని, ఇండియాలో అప్లికేషన్ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరుగుతుందని, మీటింగ్ మినిట్స్ అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంటాయని ఆ ప్రతినిధి వివరించారు. భారత్లో రెగ్యులేటరీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇన్సులిన్ ఎస్పార్ట్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ రద్దును కోరినట్టు బయోకాన్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.ఇందుకు సంబంధించిన సీఎంసీ, ప్రీ-క్లినికల్, క్లినికల్ ట్రయల్స్ డాటాను రెగ్యులేటర్కు సమర్పించినట్టు తెలిపింది.