Johnson & Johnson | పసికందుల చర్మ సంరక్షణకు వాడండి జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ అని ఇప్పటి వరకు ప్రకటనలు వచ్చేవి. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ యాజమాన్యం కీలకం నిర్ణయం తీసుకున్నది. జాన్సన్ టాల్కం పౌడర్లో క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ అవశేషాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. వచ్చే ఏడాది (2023) నాటికి అంతర్జాతీయంగా టాల్కంపౌడర్ ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది జాన్సన్ అండ్ జాన్సన్. దాని స్థానంలో మక్కలతో కూడిన కార్న్ స్టార్చ్ ఆధారిత పౌండర్ తయారు చేయాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కం పౌడర్కు వ్యతిరేకంగా 38 వేల కేసులు నడుస్తుండటం గమనార్హం. చివరకు జాన్సన్ అండ్ జాన్సన్ మంచి నిర్ణయం తీసుకున్నదని పలు చోట్ల దానికి వ్యతిరేకంగా వాదించిన న్యాయవాది ఒకరు పేర్కొన్నారు.
వివాదాలు తలెత్తడంతో రెండేండ్ల (2020) క్రితమే అమెరికా, కెనడాల్లో బేబీ టాల్కం పౌడర్ ఉత్పత్తి, విక్రయాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది. వివాదాల నేపథ్యంలో జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ ఉత్పత్తులు పడిపోయాయి. యూరప్ దేశాల్లో పూర్తిగా డిమాండ్ పడిపోయింది. టాల్కం పౌడర్లోని ప్రమాదకర, కలుషిత పదార్థాలు క్యాన్సర్కు కారణం అని పలు పరిశోధనల్లో తేలింది. దీంతో టాల్కం పౌడర్పై వినియోగదారులను జాన్సన్ అండ్ జాన్సన్ తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వచ్చాయి.
బేబీ టాల్కం పౌడర్కు పెట్టింది పేరుగా 1984 నుంచి జాన్సన్ అండ్ జాన్సన్కు ప్రచారం లభించింది. కానీ జాన్సన్ జాన్సన్ టాల్కం పౌడర్ వల్లే క్యాన్సర్ బారిన పడ్డామని బాధితులు, మృతుల బంధువుల న్యాయస్థానాల తలుపు తట్టారు. ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ 2018లో వెలువరించిన పరిశోధన నివేదిక కూడా తమ టాల్కం ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ ఉందని తొలి నుంచి జాన్సన్ జాన్సన్కు తెలుసునని పేర్కొన్నది.
తొలి నుంచి తమ టాల్కం పౌడర్పై వచ్చిన ఆరోపణలను జాన్సన్ జాన్సన్ ఖండించింది. తమ ఉత్పత్తులు సురక్షితం అని, ఆస్బెస్టాస్ రహితమని వాదిస్తున్నది. జాన్సన్ అండ్ జాన్సన్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లలో బాధితులకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పుల వల్ల జాన్సన్ అండ్ జాన్సన్ 22 మంది మహిళలకు 200 కోట్ల డాలర్లకు పైగా పరిహారం కూడా చెల్లించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను నిలిపేయాలని కోరుతూ పలువురు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేశారు.