న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఆర్థిక వ్యవస్థ క్రమేపీ పాండమిక్ ముందస్తు స్థాయికి కోలుకుంటున్న నేపథ్యంలో కీలక రంగాల్లో నియామకాలు పెరుగుతున్నాయని నౌకరి.కామ్ తెలిపింది. ఈ మార్చిలో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే నియామకాలు 16 శాతం వృద్ధి చెందినట్టు నౌకరి.కామ్ జాబ్స్పీక్ ఇండెక్స్ ద్వారా వెల్లడయ్యింది. నౌకరి.కామ్ వెబ్సైట్లో జాబ్ లిస్టింగ్స్ ఆధారంగా నెలవారీ ఉద్యోగ నియామకాల్ని జాబ్స్పీక్ మంథ్లీ ఇండెక్స్ గణిస్తుంది. అలాగే వివిధ పరిశ్రమలు, నగరాలు, అభ్యర్థుల అనుభవం వంటి అంశాల్ని సైతం లెక్కిస్తుంది. గత నెలలో నియామకాలు ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాల్లో భారీగా 82 శాతం పెరిగినట్టు ఈ సర్వే ద్వారా తేలింది. ఎడ్యుకేషన్ రంగంలో 44 శాతం, రియల్ ఎస్టేట్లో 30 శాతం, రిటైల్ రంగంలో 28 శాతం చొప్పున రిక్రూట్మెంట్స్ పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల పరిశ్రమ (బీఎఫ్ఎస్ఐ)లో 22 శాతం, ఐటీ-సాఫ్ట్వేర్ రంగంలో 14 శాతం, ఎఫ్ఎంసీజీలో 5 శాతం చొప్పున నియామకాలు అధికమయ్యాయి.