న్యూఢిల్లీ, జనవరి 14: ప్రైవేట్ రంగ టెలికం దిగ్గజం వొడాఫోన్ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నది. భారత్లోనూ వొడాఫోన్ ఐడియా ఉద్యోగులకు కోతలు తప్పేలా లేవు. అయితే విదేశాల్లో ముఖ్యంగా సంస్థ ప్రధాన కేంద్రం లండన్లో వందలాది ఉద్యోగాలు పోనున్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వొడాఫోన్లో దాదాపు 1,04,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 9,400 మంది లండన్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం, మార్కెట్ ప్రతికూల పరిస్థితులు.. వొడాఫోన్ను వ్యయ నియంత్రణ దిశగా అడుగులేయిస్తున్నాయని టెలికం రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ గడిచిన ఐదేండ్లలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను వొడాఫోన్ తీసేసిన దాఖలాలు లేవని అంటున్నారు. నిజానికి గత ఏడాది నవంబర్లోనే 2026కల్లా సంస్థ ఖర్చులను 1.08 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకోవాలని చూస్తున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఇప్పుడు ఆ నిర్ణయం అమలుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే సంస్థ సీఈవో నిక్ రీడ్ తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హంగేరీలో వ్యాపారాన్ని అక్కడి ఐటీ కంపెనీ 4ఐజీకి అమ్మేయాలని కూడా వొడాఫోన్ ఇటీవల నిర్ణయించింది. ఇక భారత్లోనూ సంస్థను రుణాలు వేధిస్తున్న సంగతి విదితమే.