JioCinema Subscription | కరోనా మహమ్మారి పుణ్యమా.. అని డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్పామ్స్లో ప్రజలంతా వినోద కార్యక్రమాలు వీక్షించారు. కరోనా తర్వాత ఓటీటీ వేదికలపై ఎంటర్టైన్మెంట్ కంటెంట్ పెరుగుతూనే ఉంది. దీన్ని రిలయన్స్ అనుబంధ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్పామ్ జియో సినిమా (Jio Cinema) తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సమాయత్తం అవుతున్నది. త్వరలో
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023 టోర్నీ ప్రసార హక్కులు పొందిన జియో.. ఉచితంగానే ఐపీఎల్ మ్యాచ్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. క్రికెట్ అభిమానుల నుంచి పాపులారిటీ పొందిన లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్పామ్ `జియో సినిమా` టోర్నీ తర్వాత సినిమా, వెబ్సిరీస్ తదితర ఆన్లైన్ కంటెంట్పై యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ కంటెంట్కు జియో సినిమా ప్రకటించే ప్లాన్లు ఇవేనంటూ ఆన్లైన్ వార్తలు, స్క్రీన్ షాట్లు షికారు చేస్తున్నాయి.
యూజర్ల కోసం జియో సినిమా మూడు ప్లాన్లు అందుబాటులోకి తెస్తుందని సమాచారం. ఈ మేరకు `జియో సినిమా టెస్టింగ్ వెబ్సైట్` స్క్రీన్షాట్ను ఓ నెటిజన్ రెడిట్ అనే వేదికలో పోస్ట్ చేయడంతో సమాచారం బయటకు వచ్చింది. డైలీ, గోల్డ్, ప్లాటినం పేర్లతో జియో సినిమా ప్లాన్లు రాబోతున్నట్లు తెలుస్తున్నది.
వాస్తవంగా డైలీ ప్లాన్ రూ.29 అని పేర్కొన్నా డిస్కౌంట్లో రూ.2లకు అందిస్తున్నట్లు సమాచారం. రెండు రూపాయల ప్యాక్తో కొనుగోలు చేస్తే 24 గంటలు జియో యాప్ ద్వారా కంటెంట్ వీక్షించొచ్చు. ఒకేసారి రెండు డివైజ్ల్లో వీక్షించవచ్చు.
గోల్డ్ స్టాండర్డ్ ప్లాన్ ధర రూ.299 అని ప్రకటించినా.. ఆచరణలో రూ.99లకే అందుబాటులోకి వస్తున్నది. ఈ ప్లాన్ మూడు నెలల పాటు చెల్లుబాటవుతుంది. ఈ ప్లాన్ ప్యాక్ కొనుగోలు చేసిన వారు కూడా ఒకేసారి రెండు డివైజ్ల్లో కంటెంట్ వీక్షించడానికి వెసులుబాటు కల్పిస్తున్నది.
ఇక ప్రీమియం ప్లాన్ ప్యాక్ రూ.1199 అని రిలయన్స్ వెల్లడించింది. కానీ డిస్కౌంట్లో రూ.599లకే లభిస్తుంది. ఏడాది గడువు ప్లాన్లో ఒకేసారి నాలుగు డివైజ్ల్లో కంటెంట్ వీక్షించవచ్చు. లైవ్ కంటెంట్ తప్ప, మిగిలిన కంటెంట్లో ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఉండవు. అయితే, అధికారికంగా రిలయన్స్ ఈ ప్లాన్లపై ప్రకటన చేయలేదు.
యూజర్లందరికీ ఒకే తరహా ప్లాన్లు ఉంటాయా.. జియో యూజర్లకు వేర్వేరు ప్లాన్లు అమల్లోకి తెస్తుందా అన్నది అధికారిక ప్రకటన చేస్తే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ పూర్తయ్యే వరకు మ్యాచ్ల ప్రసారాలు జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చునని ఇంతకుముందే రిలయస్స్ వెల్లడించింది. టోర్నీ పూర్తయ్యే సరికి కొత్త కంటెంట్ జత చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్లు అమలు చేయాలని భావిస్తున్నది.