న్యూఢిల్లీ, ఆగస్టు 24: జోరు మీదున్న దేశీయ ఫిన్టెక్ రంగంలో భారీ అంచనాలతో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జియో ఫిన్) శరవేగంగా మార్కెట్ విలువను కోల్పోయింది. గత నెలలో విలువ నిర్దారణ కోసం ఎక్సేంజీలు నిర్వహించిన ట్రేడింగ్లో రూ.262 సమీపంలో ధర పలికిన జియో ఫిన్ లిస్టింగ్ తొలిరోజైన సోమవారమే 5 శాతంలోయర్ సర్క్యూట్ను తాకి కొంత విలువను నష్టపోయింది. గురువారం వరుసగా నాలుగో రోజూ 5 శాతం లోయర్ ఫ్రీజ్కావడంతో లిస్టింగ్నాటి నుంచి జియో ఫిన్ విలువలో రూ.25,000 కోట్లు కోత పడింది. తాజాగా ఇది బీఎస్ఈలో రూ.215 వద్ద ముగిసింది. రూ.1.60 లక్షల కోట్ల విలువతో లిస్టయిన ఈ కంపెనీ వాల్యూ తాజాగా రూ.1.35 లక్షల కోట్లకు పడిపోయింది. మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నుంచి విడివడిన జియో ఫిన్ షేర్లు 1:1 రేషియోలో ఆర్ఐఎల్ ఇన్వెస్టర్లకు వచ్చాయి. పాసివ్ ఫండ్స్గా పరిగణించే దీర్ఘకాలిక ఫండ్స్ విక్రయిస్తున్న కారణంగా జియో ఫైనాన్షియల్ షేరు తగ్గుతున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జియో ఫిన్ వ్యాపార ప్రణాళికలపై సైతం ఇప్పటివరకూ స్పష్టత లేదని, ఆగస్టు 28న జరిగే ఆర్ఐఎల్ ఏజీఎంలో ఈ ఫైనాన్షియల్ కంపెనీ ప్లాన్ ఏమిటన్నది తెలుస్తుందని తాము భావిస్తున్నట్టు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. అప్పటివరకూ తాము ఈ స్టాక్పై న్యూట్రల్ ధోరణితో ఉంటామని తెలిపారు.
ఆర్ఐఎల్తో పాటే..
జియోఫిన్ మాతృసంస్థ ఆర్ఐఎల్ తన రిటైల్ వెంచర్స్ కోసం క్రితం రోజే భారీగా రూ.8,278 కోట్ల పెట్టుబడిని ఆకర్షించింది. అయినప్పటికీ ఈ షేరు గురువారం 2 శాతం మేర నష్టపోయి, నెలరోజుల కనిష్ఠస్థాయి రూ.2,475 వద్ద ముగిసింది. ఈ అంశమూ జియో ఫైనాన్షియల్కు ప్రతికూలంగా మారింది. వాస్తవానికి జియో ఫైనాన్షియల్ కార్యకలాపాలు ప్రాధమిక దశలోనే ఉన్నప్పటికీ, ఈ కంపెనీకి భారీ విలువ లభించడానికి వ్యాపారం ప్రధాన కారణం కాదు. మాతృసంస్థ నుంచి విడివడటం ద్వారా జియో ఫిన్కు 41.3 కోట్ల ఆర్ఐఎల్ ట్రెజరీ షేర్లు లభించాయి. ఇది ఆర్ఐఎల్ ఈక్విటీ మూలధనంలో 6.1 శాతం. ఈ ట్రెజరీ షేర్ల విలువ దాదాపు రూ. లక్ష కోట్లు. మాతృసంస్థ నుంచి జియో విడివడినప్పటి నుంచి ఆర్ఐఎల్ షేరు 8 శాతంపైగా తగ్గింది. ఈ మేరకు జియో కూడా తన విలువను కోల్పోవాల్సి వచ్చింది.