Jio Financial M-Cap| రిలయన్స్ అనుబంధ సంస్ధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.2 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. జియో ఫైనాన్సియల్ షేర్లు శుక్రవారం వరుసగా ఐదో రోజు దూసుకెళ్లాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఒకానొక దశలో సంస్థ స్టాక్ విలువ 10 శాతానికి పైగా పెరిగి రూ.347 లతో జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాది జియో ఫైనాన్సియల్ సంస్థ తన ఇన్వెస్టర్లకు 41 శాతం రిటర్న్స్ అందించింది. ఈ వారం షేర్ విలువ 17 శాతం పెరిగింది.
మరోవైపు జియో ఫైనాన్సియల్ పేరెంట్ సంస్థ రిలయన్స్ స్టాక్ కూడా శుక్రవారం దూసుకెళ్లింది. అంతర్గత ట్రేడింగ్’లో 0.60 శాతం పెరిగి రూ.2,988 వద్ద గరిష్ట రికార్డు నమోదు చేసింది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20.14 లక్షల కోట్ల మార్కును దాటేసింది.ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో 13 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లు కలిగి ఉన్నాయి. వాటిల్లో రిలయన్స్ రూ.20.14 లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలవగా, టీసీఎస్ రూ.14.78 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.10.78 లక్షల కోట్లతో కొనసాగుతున్నాయి.