న్యూఢిల్లీ, మే 16: విమాన ఇంధన మండుతున్నది. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న జెట్ఫ్యూయల్ సోమవారం మరో 5.3 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమనడంతో దేశీయ ఇంధన విక్రయ సంస్థలు ఈ ఏడాది ఇప్పటి వరకు పదోసారి పెంచారు. దీంతో కిలో లీటర్ ధర రూ.6,188.25 లేదా 5.29 శాతం అధికమవడంతో ధర రూ.1,23,039.71(లీటర్కు రూ.123)కి చేరుకున్నట్లు అయింది. ఈ ధరలు ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించినవి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరలు మరింత పెరగనున్నాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచాయి ఇంధన విక్రయ సంస్థలు. గత 41 రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. జెట్ ఫ్యూయల్ ధరలు ప్రతి నెల 1, 16 తేదీల్లో మార్పులు చేస్తుంటాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. కానీ, పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారిగా మారుస్తుంటాయి. అలాగే ముంబైలో కిలో లీటర్ జెట్ ఫ్యూయల్ ధర రూ.1,21,847.11, కోల్కతాలో రూ.1,27,854.60, చెన్నైలో రూ.1,27,286.13 వద్దకు చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన సరఫరాలో జాప్యం జరుగుతున్నది. దీంతో ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.
విమాన టిక్కెట్లకు రెక్కలు!
జెట్ ఫ్యూయల్ రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి విమాన ఇంధన సంస్థలు మరోసారి టిక్కెట్టు ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో 25 శాతానికి పైగా పెరిగిన ఇంధన ధరలతో సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విమానాల నిర్వహణలో 40 శాతం ఇంధనకోసం వెచ్చిస్తుండటంతో ఆయా సంస్థల ఆర్థికంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నది.
100 డాలర్ల పైనే బ్యారెల్ ఇంధన ధర
ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు భగభగమండుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో 14 ఏండ్ల గరిష్ఠ స్థాయి 140 డాలర్లు పలికిన బ్యారెల్ ధర ప్రస్తుతం 100 డాలర్ల పైన్నే కదలాడుతున్నది. బ్రెంట్ ఆయిల్ 109.76 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మరోవైపు, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనమవడం కూడా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా దేశీయంగా వినియోగించే ఇంధనంలో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతుండటంపై ప్రభావాన్ని చూపుతున్నది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు విమాన ఇంధన ధరలు తొమ్మిదిసార్లు రూ.49,017.80 చొప్పున అధికమయ్యాయి.