న్యూఢిల్లీ, మే 20: జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ ఎగిరేందుకు సిద్ధమవుతున్నాయి. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ శుక్రవారం ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏవోసీ) ఇచ్చింది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) చీఫ్ అరుణ్ కుమార్ పీటీఐకి తెలిపారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి మూడేండ్ల క్రితం విమానయాన సేవలకు ఈ సంస్థ దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జలాన్-కల్రాక్ కన్సార్టియం చేతుల్లోకి కంపెనీ వెళ్లిపోయింది. ఇప్పుడు డీజీసీఏ అనుమతి రావడంతో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కమర్షియల్ ఫ్లైట్స్ను ప్రారంభించాలని కొత్త యాజమాన్యం ప్రయత్నిస్తున్నది. ఈ నెల 15, 17 తేదీల్లో డీజీసీఏ అధికారులు జెట్ ఎయిర్వేస్ విమానాలను పరిశీలించారు. సంతృప్తి చెందడంతో ఏవోసీ మంజూరైంది.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదిత రిజల్యూషన్ ప్లాన్ కింద అన్ని నియమాలను పాటిస్తున్నామని ఈ సందర్భంగా జలాన్-కల్రాక్ కన్సార్టియం తెలియజేసింది. రాబోయే వారాల్లో విమాన సర్వీసులు, నెట్వర్క్ తదితర వివరాలను వెల్లడిస్తామని ఓ ప్రకటనలో చెప్పింది. ఈ క్రమంలోనే కొత్తగా సిబ్బంది నియామకాలుంటాయన్న కన్సార్టియం.. అవసరమైతే జెట్ ఎయిర్వేస్ పాత ఉద్యోగులకు తప్పక ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది.
నరేశ్ గోయల్కు చెందిన జెట్ ఎయిర్వేస్ చివరి విమానం 2019 ఏప్రిల్ 17న నడిచింది. ఆ తర్వాత సేవలు నిలిచిపోయాయి. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కూటమికి జెట్ ఎయిర్వేస్ రూ.8,000 కోట్లు బకాయిపడింది. దీంతో వీటి వసూలుకు 2019 జూన్లో బ్యాంకర్లు సంస్థపై దివాలా పిటిషన్ వేశారు. 2020 అక్టోబర్లో బ్రిటన్కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన ఎంటర్ప్రెన్యూర్ మురారీ లాల్ జలాన్లతో కూడిన కూటమి సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్కు బ్యాంకర్లు అంగీకరించారు. దీన్ని గత ఏడాది జూన్లో ఎన్సీఎల్టీ ఆమోదించింది. ఇప్పుడు డీజీసీఏ అనుమతులు రావడంతో మళ్లీ ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ విమాన సేవలకు మార్గం సుగమమైంది.