ITR Extention | పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. 2020-21 (2021-22 అంచనా) ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిర్ణయం తీసుకున్నది. వచ్చే మార్చి 15 వరకు ఈ గడువు పొడిగిస్తున్నట్లు మంగళవారం ట్వీట్ చేసింది. కొవిడ్-19 కారణంగా ఐటీరిటర్న్స్ దాఖలు గడువు పొడిగించామని తెలిపింది.
ఇంతకుముందు 2021 డిసెంబర్ 31తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు అని పేర్కొన్నది. చివరి రోజు కూడా మరోమారు ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించేది లేదని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ ప్రకటించారు. ఇప్పటి వరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్ 31నాటికి సుమారు 5.89 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత గడువు డిసెంబర్ 31 నాటికి కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్లో చివరి రోజు ఒక్కరోజే 46.11 లక్షలకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి గడువు 2021 జనవరి 10 నాటికి 5.95 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2020 జనవరి 10న చివరి రోజు 31.05 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి.