Itel A70 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) త్వరలో భారత్ మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే కొత్త ఫోన్ తీసుకు రానున్నది. ఐటెల్ ఏ70 (Itel A70) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,000 లోపు ధరకే లభ్యం కానున్నదని తెలుస్తున్నది. దీని ధర రూ.7,490 ఉంటుందని భావిస్తున్నారు. వర్చువల్ గా ఈ ఫోన్ ర్యామ్ మరో 4జీబీ పెంచుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో ఇంత చౌక ధరకు అందుబాటులోకి వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని ఐటెల్ పేర్కొంది. వచ్చేనెల 31న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు.
నాలుగు రంగుల ఆప్షన్లలో వస్తున్నది ఐటెల్ ఏ70 ఫోన్. బ్రిలియంట్ గోల్డ్, స్టైలిష్ బ్లాక్, ఫీల్డ్ గ్రీన్, అజూర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 13- మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 6.6-అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ603 చిప్ సెట్ కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.