IT Returns | గత ఆర్థిక సంవత్సరా (2021-22)నికి ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నది. కొన్నేండ్లుగా ఐటీఆర్ దాఖలులో కేంద్రం పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రతి వేతన జీవి, వ్యాపారి, కార్పొరేట్ సంస్థలు తాము సంపాదించిన ఆదాయం, ఖర్చుల్లో ఐటీఆర్లో సమర్పించాల్సిన వివరాలు పెరిగిపోయాయి. ఆదాయం పన్ను విభాగం కూడా ఈ అంశాలన్నీ ఒకే చోటికి తెచ్చి ఐటీఆర్ దాఖలు చేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నది. కనుక వేతన జీవులు కాసింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి చిక్కుల్లేకుండా.. సజావుగా ఐటీఆర్ సబ్మిట్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆ జాగ్రత్తలేమిటంటే..
ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలో ముందే నిర్ధారించుకోవాలి. లేకపోతే మీరు సబ్మిట్ చేసే ఐటీ రిటర్న్స్ పత్రాలను ఆదాయం పన్నువిభాగం ఆమోదించకపోవచ్చు. కనుక మీ ఆదాయం, ఆ ఆదాయం మార్గాలు, ఇన్వెస్ట్మెంట్లు, ఒకటికంటే ఎక్కువ ఇండ్లు.. ఆదాయ వనరును బట్టి ఐటీఆర్ ఫామ్లు మారుతాయి.
వేతనంపైనే ఆధారపడిన వారు ఐటీఆర్-1 ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక స్టాక్మార్కెట్లలోని వివిధ సంస్థల ఈక్విటీల్లో పెట్టుబడులతో లాభనష్టాలు ఎదుర్కొనేవారు, ఇతర ప్రొఫెషనల్, వ్యాపార ఆదాయ మార్గాలు కల వారు ఐటీఆర్-2, షేర్ మార్కెట్లలో ఇంట్రాడే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ వ్యాపార లావాదేవీలు జరిపేవారు ఐటీఆర్-3 ఫామ్ సబ్మిట్ చేయాలి.
ప్రస్తుత అంచనా (అసెస్మెంట్ ఇయర్) సంవత్సరం 2022-23 (గత ఆర్థిక సంవత్సరం 2021-22)కి ఆదాయం పన్నువిభాగం 90 శాతానికి పైగా నింపిన ఐటీఆర్ ఫామ్లను పన్ను చెల్లింపుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫామ్ ఒకసారి చెక్ చేసుకుని, వ్యక్తిగత వివరాలు (మీ పేరు, అడ్రస్, ఫోన్, ఈ-మెయిల్) సరిగ్గా ఉన్నాయా.. లేదా.. సరి చూసుకోవాలి. మార్పులేమైనా ఉంటే ఐటీఆర్ ఫామ్కి బదులు పోర్టల్లోని అప్డేట్ విభాగానికి వెళ్లి ఆ వివరాలు పేర్కొన్నాలి.
వేతన జీవులు చెల్లించాల్సిన పన్ను నిర్ధారణలో పారదర్శకత కోసం ఆదాయం పన్ను విభాగం.. ఫామ్-26ఎఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లను పన్ను చెల్లింపుదారులకు అందుబాటులోకి తెస్తున్నది. ఈ రెండింటినీ ఒకసారి చెక్ చేసుకుని.. వీటి ఆధారంగా ఐటీఆర్ దాఖలు చేయాలన్న సంగతి గుర్తుంచుకోవాలి. రెండింటి మధ్య తేడాలు ఉంటే.. ఏఐఎస్పై ఐటీ విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. అలా ఏఐఎస్లో తేడాలపై ఫిర్యాదు చేసి, సమస్య పరిష్కరించుకోకుండా.. అసలు ఫిర్యాదు చేయకుండా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే చిక్కులు ఎదురవుతాయని ఆర్థిక వేత్తలు, ఐటీ నిపుణులు చెబుతున్నారు.
ఒక్కోసారి మీ ఇన్కం డిటైల్స్.. ఏఐఎస్లో రికార్డు కాకపోతే.. ఆ వివరాలు ఐటీ విభాగానికి తెలియదని కాదు.. మీ ఆదాయ వనరుల వివరాలను నమోదు చేయడంపై పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఆస్తుల క్రయ, విక్రయాలు, విదేశాల నుంచి వచ్చే ఇన్కం, కంపెనీలో డైరెక్టర్, స్టాక్మార్కెట్లో లిస్ట్ కాని అన్లిస్టెడ్ సంస్థల షేర్ల లావాదేవీల వివరాలను తప్పనిసరిగా ఐటీ విభాగానికి తెలియజేయాల్సిందే.
కొన్ని రకాల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన తదితర పొదుపు పథకాలపై వచ్చే వడ్డీ ఆదాయం.. బంధువల నుంచి (నిబంధనలకు లోబడి) వచ్చే గిఫ్ట్లు పన్ను మినహాయింపు కిందకొస్తాయి. అలాగని, ఐటీఆర్ దాఖలు సమయంలో ఈ వివరాలు నమోదు చేయడం మరిచిపోవద్దని చెబుతున్నారు.
వివిధ రూపాల్లో మీ ఆదాయం రూ.లక్ష దాటితే ఐటీఆర్ దాఖలు చేసే విషయమై కేంద్రం కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది. రూ.2 లక్షలకు పైగా విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేసేవారు, వార్షిక ఇంటి విద్యుత్ బిల్లు రూ.లక్ష దాటినా, విదేశీ ఆస్తులు ఉన్నా, బ్యాంకు డిపాజిట్లలలో రూ.50 లక్షల పై చిలుకు ఉంటే, టీడీఎస్ లేదా టీసీఎస్ రూ.25 వేలు దాటితే తప్పనిసరిగా మీరు ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిందే. వీరంతా ఆదాయం పన్ను పరిమితిలోపే ఆదాయం ఉన్నా ఐటీఆర్లు దాఖలు చేయాల్సిందే.
ఐటీఆర్ సబ్మిట్ చేయడంతోనే మీ పని పూర్తికాదు. ఐటీఆర్ను ఈ-వెరిఫై చేసుకున్నప్పుడే ఐటీఆర్ దాఖలు ప్రక్రియ పూర్తవుతుంది. ఆధార్ ఓటీపీతో తేలిగ్గా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. బెంగళూరులోని ఐటీ విభాగం పీసీసీ కేంద్రానికి ఐటీఆర్-5 పామ్ పంపినా సరిపోతుంది. అలా చేయం కంటే ఈ-వెరిఫై చేసుకోవడమే మేలు.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు రీఫండ్ కోరే వేతన జీవులు తమ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా పేర్కొనాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరులో తేడాలు ఉంటే రీఫండ్ మొత్తం మీ ఖాతాలో జమ కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక మీరు ముందుగానే బ్యాంక్ ఖాతా వివరాలు వెరిఫై చేసుకోవడం మంచిదని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.