హైదరాబాద్, ఆగస్టు 25: దేశీయ ఐటీ రంగంలో మధ్యశ్రేణి సంస్థగా వెలుగొందుతున్న పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దూకుడు పెంచింది. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ విస్తరిస్తున్న ఈ ప్రపంచ ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ.. రాష్ట్ర ఐటీ రంగ కార్యకలాపాల్లోనూ తనదైన ముద్రను వేస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో సేవలందిస్తున్న పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. మరిన్ని పెట్టుబడులతో ఇక్కడ తమ సామర్థ్యాన్ని పెంచుకోబోతున్నది. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మ్రంతి కేటీఆర్తో కంపెనీ ప్రతినిధులు చర్చించారు. వచ్చే రెండేండ్లలో కొత్తగా వెయ్యి ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధమని పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈవో సందీప్ కల్రా తెలిపారు. కాగా, దేశ, విదేశాల్లో పలు కంపెనీలను కొనుగోలు చేసిన పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దాదాపు దశాబ్ద కాలంగా రాష్ట్ర ఐటీ రంగ విస్తరణపై మక్కువ ప్రదర్శిస్తుండటం గమనార్హం.
సంస్థ : పర్సిస్టెంట్ సిస్టమ్స్
ప్రారంభం : 1990
ప్రధాన కేంద్రం : పుణె
పరిశ్రమ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
వ్యవస్థాపక
సీఎండీ : ఆనంద్ దేశ్పాండే
సీఈవో : సందీప్ కల్రా
రెవెన్యూ : రూ.8,350 కోట్లు
(2022-23)
నికర లాభం : రూ.921 కోట్లు
(2022-23)
ఉద్యోగులు : 21 వేలపైనే