హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని స్వీడన్ కంపెనీలకు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆహ్వానం పలికారు. ముఖ్యంగా సాంకేతిక, తయారీ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారత్లోని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ నేతృత్వంలో ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు, పలు కంపెనీల అధిపతులు బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ఇకోసిస్టం, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, పారిశ్రామిక విధానాల గురించి వారికి కేటీఆర్ వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానమని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. స్వీడన్ రాయబారి ప్రతినిధి బృందంలో భాగంగా వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్లో తమ కార్యకలాపాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను ప్రత్యేకంగా వారు ప్రశంసించారు.
హైదరాబాద్ వ్యాపార అనుకూలతలు ఉన్న నగరమని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ప్రశంసించారు. హైదరాబాద్కు స్వీడన్ పెట్టుబడులను రప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై తమ రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలన చేస్తున్నదని, స్వీడన్ కంపెనీలకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.