iPhone 15 Plus | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్’ తన ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. వాటిల్లో బేస్ మోడల్ ఐ-ఫోన్ 15తోపాటు ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్లస్ కూడా ఉన్నాయి. ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ కాంట్రాక్ట్ సంస్థ ఫాక్స్కాన్.. ఐ-ఫోన్ల తయారీపై కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్నేండ్లుగా ఐ-ఫోన్ 13, ఐ-ఫోన్ 14 మోడల్ ఫోన్లతోపాటు ఐ-ఫోన్ నాన్-ఫ్రో మోడల్స్ హ్యాండ్ సెట్లు భారత్లోనే తయారు చేస్తున్నారు.
కొన్ని వారాల క్రితమే భారత్లోనే ఐ-ఫోన్ 15 మోడల్స్ తయారీ ప్రారంభమైందని బ్లూం బర్గ్ ఓ వార్తాకథనం ప్రచురించింది. చెన్నైలోని ఫాక్స్కాన్ యూనిట్లో అక్టోబర్, డిసెంబర్ మధ్య ఐ-ఫోన్ 15 ప్లస్ మోడల్స్ ఫోన్లు తయారు చేయనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్లో ఉత్పత్తి నెమ్మదిగా సాగుతుండటంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆపిల్ వర్గాలు తెలిపాయి.
భారత్ మార్కెట్లో ఆపిల్ ఐ-ఫోన్ ప్లస్ ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.89,900 నుంచి ప్రారంభం అవుతుంది. 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ నెల 22 నుంచి బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో భారత్ మార్కెట్లో సేల్స్ ప్రారంభం అవుతాయి.