Investors Wealth | స్టాక్ మార్కెట్లలో సంపద సృష్టి మోడ్ ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. గత నెల రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో కరెక్షన్ అంటే సర్దుబాటు ధోరణి వచ్చేసింది. గత నెల 19న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 62,245 పాయింట్లతో నూతన రికార్డు నెలకొల్పింది. అదే రోజు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 18,604 పాయింట్ల వద్ద న్యూ రికార్డు సృష్టించింది. నాటి నుంచి ఇండెక్స్లు 8 శాతం నష్టపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు దాదాపు రూ.16 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
కేవలం శుక్రవారం నాడే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సుమారు మూడు శాతం పతనం అయ్యాయి. దీనికి హైలీ మ్యూటెంట్ కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ కారణం కావచ్చునని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమాంగ్ జానీ చెప్పారు. రియాల్టీ, మెటల్స్, బ్యాంక్స్, ఆటోమొబైల్ ఇండెక్స్లు భారీగా నష్టపోయాయి. ఫార్మా రంగ స్క్రిప్ట్లు మాత్రమే ఎక్కువగా లాభ పడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత నెల 19న రూ.2,74,69,606, 93 కోట్లుగా ఉంది. శుక్రవారం అది రూ.2,58,30,168.59 కోట్లకు పడిపోయింది. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ గరిష్ఠంగా 13.6 శాతం పతనమైంది. ఇక ఎనర్జీ ఇండెక్స్ 10 శాతం, బ్యాంకెక్స్ 8.2, ఫైనాన్స్ 7.37, ఎఫ్ఎంసీజీ 7.04, ఐటీ 6.68, ఆయిల్ అండ్ గ్యాస్ 6.1, ఆటో 6.01, రియాల్టీ 5.74 శాతం నష్టపోయాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ 5.65 శాతం, 4.6 శాతం నష్టపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వు ఉద్దీపన పథకాన్ని రాబోయే రోజుల్లో తగ్గించి, వడ్డీరేట్లు పెంచనున్నట్లు సంకేతాలిచ్చింది. ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా మార్కెట్లలో లాభాలపై నిరాసక్తిగా ఉండటం, పలు దేశాల్లో ద్రవ్యోల్బణం వంటి అంశాలు మార్కెట్ల పతనానికి కారణమని భావిస్తున్నారు.