న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : గత ఆర్థిక సంవత్సరం (2022-23) గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే ఏకంగా 74 శాతం క్షీణించి రూ.653 కోట్లకే పరిమితమయ్యాయి. గతంలో రూ.2,541 కోట్లుగా ఉండటం గమనార్హం. అయితే మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయడం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ తగ్గుదల అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం గోల్డ్ ఈటీఎఫ్ల అసెట్ బేస్, ఇన్వెస్టర్స్ అకౌంట్ లేదా ఫోలియో నెంబ ర్స్ పెరిగాయని దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాలు చెప్తున్నాయి. కాగా, గత కొన్నేండ్లుగా రిటైల్ మదుపరులు గోల్డ్ ఈటీఎఫ్ల కంటే ఈక్విటీల్లోకే పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ఆకర్షణీయ రాబడులు వస్తుండటమే కారణం.