న్యూఢిల్లీ, మార్చి 20: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరారీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ (గ్లోబల్ పోలీస్ వ్యవస్థ) ఎత్తివేసినట్టు తెలుస్తున్నది. ఈ కేసు ప్రధాన నిందితుల్లో చోక్సీ ఒకరన్న విషయం తెలిసిందే. కాగా, ఇంటర్పోల్ తాజా నిర్ణయంతో ఇక చోక్సీ భారత్ మినహా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగేయవచ్చు. దీంతో చోక్సీని పట్టుకోవడానికి భారతీయ దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు దాదాపు దూరమైనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2018 జనవరిలో భారత్ నుంచి చోక్సీ పారిపోగా, తాను పౌరసత్వం తీసుకున్న కరేబియన్ దేశం ఆంటిగ్వా-బార్బుడాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పౌరసత్వం కోసం చోక్సీ లక్ష డాలర్లు వెచ్చించాడు. అయితే సీబీఐ, ఈడీల విజ్ఞప్తి మేరకు అదే ఏడాది డిసెంబర్లో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. కానీ ఇప్పుడు చోక్సీ పిటిషన్ను పరిశీలించిన ఇంటర్పోల్.. అతనిపై ఉన్న రెడ్ కార్నర్ నోటీసును వెనక్కి తీసుకున్నదని, వాంటెడ్ లిస్టు నుంచి తొలగించిందని సమాచారం. చోక్సీని భారతీయ దర్యాప్తు ఏజెన్సీలు కిడ్నాప్ చేయాలని చూశాయని, కాబట్టి వాటి విజ్ఞప్తిని తోసిపుచ్చి, చోక్సీ పేరు వాంటెడ్ జాబితా నుంచి తీసేయాలని ఆయన తరఫు ప్రతినిధి ఇంటర్పోల్ను కోరారని అంటున్నారు. దీన్ని నమ్మడం వల్లే ఇంటర్పోల్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నదని చెప్తున్నారు.
కాగా, ఈ రెడ్ కార్నర్ నోటీసుతో ఇంటర్పోల్లో సభ్యత్వం ఉన్న 195 దేశాల్లో ఎక్కడైనా చోక్సీని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వీల్లేకుండా పోయింది. మరోవైపు దీనిపై ఇటు సీబీఐగానీ, అటు ఈడీగానీ స్పందించడం లేదు. భారతీయ బ్యాంకింగ్ చరిత్రలోనే పీఎన్బీ కుంభకోణం అత్యంత పెద్దదిగా నిలిచిన సంగతి విదితమే. మెహుల్ చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ కలిసి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకును రూ.14,000 కోట్లు ముంచారు. అయితే ఇప్పటికే నీరవ్ మోదీని బ్రిటన్లో పట్టుకోగా.. భారత్కు రప్పించేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తున్నది.