IT Recruitments | దేశంలోని అతిపెద్ద ఐటీ దిగ్గజాల్లో నూతన నియామకాలు ఊపందుకోనున్నాయి. నిపుణులను ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో అత్యంత ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన ప్యాకేజీని ప్రకటించాయి. అత్యంత నిపుణులైన ఐటీ ఇంజినీర్లకు అవసరమైతే 70-120 శాతం వేతనం పెంచేందుకు సిద్ధం అని సంకేతాలిచ్చాయి. గతంలో ఐటీ ఉద్యోగులు 10 నుంచి 30 శాతం శాలరీ హైక్ కోరుకునే వారు.
కరోనా టైంలో నియామకాలు తగ్గుముఖం పట్టడం ఐటీ కంపెనీలు తాజాగా దూకుడుగా నియామకాలు చేపట్టడానికి కారణంగా తెలుస్తోంది. కరోనా తొలి దశలో ఐటీ రంగంలో నియామకాలు కేవలం 50 శాతం మాత్రమే ఉన్నాయి. ఐటీ నిపుణులకు సుమారు 400 శాతం డిమాండ్ ఉందని ఇండీడ్ ఇండియా అనే జాబ్ సెర్చ్ పోర్టల్ నివేదించింది.
గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అప్లికేషన్ డైవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ వంటి స్కిల్డ్ సాంకేతిక నిపుణుల పోస్టులకు 150-300 శాతం డిమాండ్ ఉంది.
కొంత కాలం పని చేసి మానేసిన మహిళా ప్రొఫెషనల్స్ నియామక డ్రైవ్ చేపట్టినట్లు ఇటీవల టీసీఎస్ ప్రకటించింది. ప్రతిభ, సామర్థ్యం ఎల్లవేళలా ఉంటాయి. అనుభవజ్ఞులైన మహిళా నిపుణులకు తిరిగి పనులు ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.