న్యూఢిల్లీ : భారత్ లో కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో ఇన్ఫోసిస్ సహా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నాయి. కొవిడ్ కేర్ సౌకర్యాలను విస్తరించడంతో పాటు వైరస్ సోకిన వారు, ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుంటున్న ఉద్యోగులకు అదనంగా పెయిడ్ లీవ్ లను ఆఫర్ చేస్తున్నాయి. వీరికి 21 రోజుల అదనపు పెయిడ్ లీవ్ ను మంజూరు చేస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరు, పుణేలో తమ ఉద్యోగుల కోసం కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. పుణే కేంద్రాన్ని రుబీ హాల్ హాస్పిటల్ నిర్వహిస్తుండగా బెంగళూర్ కేంద్రం బాధ్యతలను మణిపాల్ హాస్పిటల్స్ పర్యవేక్షిస్తున్నాయి.
గ్రూప్ ఎంప్లాయి ఇన్సూరెన్స్ కింద కొవిడ్ సంబంధిత వైద్య చికిత్సలను కవర్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ టెస్టింగ్ ల్యాబ్స్ తో కూడా అవగాహన కుదుర్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల చికిత్స కోసం 242 నగరాల్లోని 1490 దవాఖానలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఇక కొవిడ్ సోకిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తింపచేస్తామని క్యాప్ జెమిని పేర్కొంది. మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో తమ బెంగళూర్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లో ఉద్యోగుల కోసం గత వారం వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించింది.