Infosys | కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రం హోం కల్చర్ రావడం.. నిపుణులు, ప్రతిభావంతులకు గిరాకీ పెరగడం.. ఐటీ సంస్థల్లో వలసలు ( attrition ) పెరిగిపోయాయి. దిగ్గజ సంస్థలన్నింటికీ ఈ వలసల (attrition)తో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వలసలను నియంత్రించడానికి ఇన్ఫోసిస్ తీసుకొచ్చిన కొత్త రూల్.. వివాదాలకు కేంద్రం అవుతున్నది. తమ సంస్థలో పని చేసి రాజీనామా చేసిన ఉద్యోగులు ఇతర ఐటీ సంస్థల్లో ఏడాది పాటు చేరకూడదని ఇన్ఫోసిస్ తీసుకొచ్చిన నిబంధన విమర్శలకు తావిచ్చింది. తొలుత ఇది ఇన్పోసిస్, ఉద్యోగుల మధ్య వివాదంగా ఉంది.. తర్వాత కేంద్ర కార్మిక శాఖ రంగ ప్రవేశం చేసింది. ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిటిషన్పై సోమవారం లోపు సమాధానం ఇవ్వాలని 17న జరిగే సమావేశానికి ఇన్ఫోసిస్ యాజమాన్య ప్రతినిధులు హాజరు కావాలని కేంద్ర కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఏడాది పాటు తాము ఉద్యోగం చేయకుండా ఇన్ఫోసిస్ తమ హక్కులను కాల రాస్తున్నదని ఆరోపిస్తూ కేంద్ర కార్మికశాఖకు నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని ఇన్ఫోసిస్ను కేంద్ర కార్మికశాఖ ఆదేశించింది. కానీ.. ఆ సమావేశానికి తాము హాజరు కాలేం అని.. అయినా నాసెంట్ నుంచి తమకు ఫిర్యాదు అందలేదని ఇన్పోసిస్ వాదించింది.
తొలి చర్చలకు ఇన్ఫోసిస్ గైర్హాజరు కావడంతో ఆ సంస్థ హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ క్రిష శంకర్కు కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్లేబర్ కమిషనర్ రెమిస్ తిరు లేఖ రాశారు. నాసెంట్ ఫిర్యాదులపై ఈ నెల 16కల్లా సమాధానం ఇవ్వాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. 17న జరిగే సమావేశానికి తప్పనిసరిగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు హాజరు కావాలని పేర్కొన్నారు.