Infosys | భారత్ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’కు భారీ షాక్ తగిలింది. గత సెప్టెంబర్లో ఇన్ఫోసిస్తో అగ్రిమెంట్ చేసుకున్న ఓ గ్లోబల్ కంపెనీ.. ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. దీనివల్ల 150 కోట్ల డాలర్ల (సుమారు రూ.12 వేల కోట్లు) ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇన్ఫోసిస్ శనివారం ప్రకటించింది. డిజిటల్ సేవలతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్ ఫోకస్డ్ సర్వీసులు అందించేందుకు సదరు సంస్థతో ఇన్ఫీ గత సెప్టెంబర్ 14న 15 ఏండ్ల గడువుతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు అప్పట్లో తెలిపింది.
ఆరేండ్లుగా ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పని చేసిన నిలంజయన్ రాయ్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు వారాల్లో ఇన్ఫీ ఈ కాంట్రాక్ట్ను కోల్పోవడం గమనార్హం. ఇన్ఫీ భవితవ్యం పట్ల ఆందోళనతో గత 12 నెలల్లో దాదాపు ఎనిమిది మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు సంస్థకు గుడ్ బై చెప్పారు.
సాధారణంగా భారీ సంస్థలతో ఒప్పందం వల్ల సాఫ్ట్వేర్ సంస్థల ఆదాయం పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి. కానీ ఏఐ బేస్డ్ గ్లోబల్ సంస్థ కాంట్రాక్టును కోల్పోవడం వల్ల ‘ఇన్ఫీ’పై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో చెప్పుకోదగినంత ఇన్పోసిస్ రెవెన్యూ గ్రోత్ సాధించలేదు. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ గైడెన్స్ లో కోత విధించింది. ఇంతకుముందు 1-3.5శాతం గ్రోత్ సాధిస్తుందని అంచనా వేయగా, తాజాగా దాన్ని 1-2.5 శాతానికి కుదించి వేసింది.