న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశంలో టోకు ధరలు గత మూడు దశాబ్దా ల్లో ఎన్నడూ లేనం త వేగంగా పెరిగాయి. ఈ నవంబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏకంగా 14.23 శాతం ఎగసింది. 1991 డిసెంబర్లో నమోదైన 14.30 శాతం తర్వాత ఇదే అత్యధికం. 2020 నవంబర్లో ఇది 2.29 శాతమే. ఈ ఏడాది అక్టోబర్లో ఇది 12.54 శాతంగా ఉంది. లోహాలు, క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, ఆహారోత్పత్తుల ధరలు 2020 నవంబర్తో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో బాగా పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం అధికంగా నమోదయ్యిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా ఇంధనం, విద్యుత్తు ధరలు 2020 నవంబర్కంటే ఈ దఫా 40 శాతం పెరగడం అధిక ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు, ఇంధన ధరలు గరిష్ఠస్థాయికి చేరినందున, ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరుగుతున్నదన్నారు. కనిష్ఠ ద్రవ్యోల్బణం రేటును నమోదుచేసే అమెరికాలో కూడా రికార్డుస్థాయికి చేరిందన్నారు.
టోకు ద్రవ్యోల్బణం అంటే…
దేశంలో ద్రవ్యోల్బణాన్ని (ధరల పెరుగుదల) రిటైల్, టోకు ధరల ప్రాతిపదికన లెక్కిస్తారు. వస్తూత్పత్తుల రిటైల్ ధరల్లో మార్పుల్ని కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ), హోల్సేల్ ధరల్లో మార్పుల్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లు (డబ్ల్యూపీఐ) సూచిస్తాయి. ఆయా ఉత్పత్తుల ధరలు పెరుగుదల, తగ్గుదల ఆధారంగా ఈ ఇండెక్స్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఆయా సూచీల్లో మార్పుల్నే శాతం రూపంలో చూపించేదే ద్రవ్యోల్బణ శాతం. డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని అనుసరించి ఆర్థిక, వాణిజ్య విధానాల్లో మార్పుచేర్పులకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దమవుతుంది.
‘ డబ్ల్యూపీఐ14.2 శాతానికి పెరగడం షాక్. పలు ఉత్పత్తుల ధరలు అంచనాలకంటే
అధికంగా పెరిగాయి. ప్రాధమిక ఆహారోత్పత్తుల ధరలు పెరుగుతున్నందున ప్రస్తుత నెలలో (డిసెంబర్) ద్రవ్యోల్బణం మరింత అధికం కావొచ్చు’
-అదితి నాయర్, చీఫ్ ఎకానమిస్ట్, ఇక్రా