Luxury Homes | సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. తమ దీర్ఘకాలిక స్వప్నం కూడా.. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో రోజువారీ కుటుంబ నిర్వహణ, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు ఉంటాయి. వాటిని మించి ఆదాయం మిగిలితే సొంతింటి కల సాకారం చేసుకోవడానికి మొగ్గు చూపేవారు. అందుబాటు ధరలో ఇల్లు.. అదీ బ్యాంకు రుణం తీసుకుని మరీ ఇల్లు కొనుక్కునే వారు.. కానీ, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి మారుతోంది. అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య లగ్జరీ, ప్రీమియం ఇండ్లకు, విల్లాలకు గిరాకీ పెరిగింది. రియాల్టీ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఆసియా నిర్వహించిన సర్వేలో ఈ సంగతి వెల్లడయింది.
2022తో పోలిస్తే హైదరాబాదీల్లో లగ్జరీ ఇండ్లను సొంతం చేసుకునే వారు పెరిగిపోయారు. 2022తో పోలిస్తే హైదరాబాద్లో లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లు దాదాపు 800 శాతం పెరిగాయి. తర్వాతీ స్థానంలో ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో 216 శాతం లగ్జరీ ఇండ్ల విక్రయాలు పెరిగాయి. కోల్కతాలో 100 శాతం, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో 44 శాతం, పుణెలో గతేడాదితో పోలిస్తే దాదాపు 13 శాతం గ్రోత్ నమోదైంది.
కరోనా వేళ వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్పేసియస్గా, మెరుగైన వసతులు గల లగ్జరీ ఇండ్లపైనే ఫోకస్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర గల 430 ఇండ్లు అమ్ముడయ్యాయి. గతేడాది కేవలం 50 లగ్జరీ ఇండ్లు మాత్రమే అమ్ముడు కావడం గమనార్హం. దేశంలోని ఏడు మెట్రో పాలిటన్ నగరాల పరిధిలో లగ్జరీ ఇండ్ల విక్రయాలు 2.5 రెట్లు పెరిగి 4000 యూనిట్ల సేల్స్ జరిగాయి. ఏడాది క్రితం కేవలం 1600 లగ్జరీ ఇండ్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మూడు రెట్లు లగ్జరీ ఇండ్ల విక్రయాలు పెరిగాయి. గతేడాది జనవరి – మార్చి మధ్య 600 లగ్జరీ ఇండ్లు అమ్ముడైతే ఈ ఏడాది 1900కు పెరిగింది. ముంబైలో 800 నుంచి 1150, పుణెలో 10 నుంచి 150 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో డిమాండ్ పెద్దగా లేకపోవడంతో 50 ఇండ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కోల్కతాలో రెట్టింపు ఇండ్ల సేల్స్ జరిగి 50 నుంచి 100కు పెరిగాయి. చెన్నైలో ఐదు రెట్లు పెరిగింది. గతేడాది కేవలం 50 లగ్జరీ ఇండ్లు మాత్రమే అమ్ముడు కాగా, ఈ ఏడాది 250 ఇండ్లు సేల్ అయ్యాయి.
అన్ని సెగ్మెంట్ల ఇండ్ల విక్రయాల్లో ముంబై మొదటి స్థానంలో నిలిచింది. ముంబైలో 19 వేలు, పుణెలో 18 వేలు, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 11,600, బెంగళూరులో 11,500 ఇండ్లు అమ్ముడయ్యాయి. సీబీఆర్ఈ ఇండియా, సౌత్ అండ్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా విభాగం సీఈఓ కం చైర్మన్ అంశురామ్ మ్యాగజైన్ మాట్లాడుతూ ఈ ఏడాది లగ్జరీ ఇండ్ల కొనుగోలుతోపాటు సొంతింటి కల సాకారం చేసుకునే వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్నారు.మున్ముందు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు.