న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కార్పొరేట్ ఇండి యా నియామకాల బాట పట్టబోతున్నది. వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి మరి. మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ తాజా సర్వేలో 37 శాతం కంపెనీలు 2024 తొలి త్రైమాసికంలో భారీగా కొత్త ఉద్యోగాలివ్వబోతున్నట్టు సంకేతాలిచ్చాయి. దేశీయ కార్పొరేట్ వర్గాలు చెప్పినదాన్ని చూస్తే.. రాబోయే జనవరి-మార్చిలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్లో మాత్రమే రిక్రూట్మెంట్లు ఉండబోతున్నాయని మ్యాన్పవర్గ్రూప్ అంటున్నది. దేశంలో నెలకొన్న ఉత్సాహకరమైన పరిస్థితుల మధ్య సిబ్బందిని పెంచుకునే యోచనలో ఉన్నామని కంపెనీలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రంగాలు, ప్రాంతాలకు చెందిన దాదాపు 3,100 సంస్థల అభిప్రాయాలతో ఈ సర్వేను మ్యాన్పవర్గ్రూప్ చేపట్టింది. ఈ క్రమంలోనే 41 దేశాల్లో నెట్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ (ఎన్ఈవో) భారత్లో మాత్రమే అత్యధికంగా ఉన్నట్టు తేలింది.
ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో వ్యాపార పరిస్థితులు మెరుగ్గా కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా మ్యాన్పవర్గ్రూప్ తెలిపింది. ఈ రంగాల ఔట్లుక్ గరిష్ఠంగా 45 శాతంగా ఉన్నది. 44 శాతంతో ఐటీ, 42 శాతంతో కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు పేర్కొన్నది. 28 శాతంతో ఎనర్జీ అండ్ యుటిలిటీస్ ఆఖర్లో నిలిచాయి. కాగా, కొత్త ఉద్యోగాల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్, నెదర్లాండ్స్ సంయుక్తంగా 37 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, 35 శాతంతో ఆ తర్వాతి స్థానంలో కోస్తారికా, అమెరికా నిలిచాయి. మెక్సికో 34 శాతంతో ఉన్నది. ప్రపంచ సగటు 26 శాతంగా ఉన్నట్టు మ్యాన్పవర్గ్రూప్ చెప్పింది.
నైపుణ్యాన్వేషణలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు సర్వేలో పాల్గొన్న 81 శాతం దేశీయ కంపెనీలు చెప్పడం గమనార్హం. ఈ కారణంగానే రవాణా, లాజిస్టిక్స్, ఆటోమోటివ్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. తర్వాతి స్థానంలో ఐటీ రంగం ఉన్నది. కాగా, నైపుణ్య కొరత వేధిస్తున్న దేశాల్లో జపాన్ 85 శాతంతో ముందున్నది. ఆ తర్వాత జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్ దేశాలున్నట్టు మ్యాన్పవర్గ్రూప్ చెప్పింది. ఇదిలావుంటే ఐటీ అండ్ డాటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, హెచ్ఆర్ విభాగాల్లో నిపుణులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నట్టు సర్వే గుర్తించింది.