న్యూఢిల్లీ, నవంబర్ 30: పెరుగుతున్న వడ్డీ రేట్లు, కమోడిటీ ధరలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చక్రాలకు బ్రేకులు వేశాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికి మందగించింది. తొలి త్రైమాసికమైన 2022-23 ఏప్రిల్-జూన్లో కనపర్చిన 13.5 శాతం వృద్ధి రెండో త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2021-22 జూలై-సెప్టెంబర్కాలంలో సాధించిన 8.4 శాతం వృద్ధి రేటు నుంచి కూడా ఇది పడిపోయింది. 2011-12 బేస్ ధరల ప్రకారం 2022-23 క్యూ2లో జీడీపీ రూ.38.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నట్లు బుధవారం కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. 2021-22 ద్వితీయ త్రైమాసికంలో ఇది రూ.35.89 లక్షల కోట్లు. దీంతో నిరుడుకంటే 6.3 శాతం వృద్ధి సాధించినట్లయ్యింది. 2020-21 జూలై-సెప్టెంబర్లో ఇది రూ. 33.10 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల ప్రకారం ఈ క్యూ2లో జీడీపీ రూ.65.31 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నామని జాతీయ గణాంకాల శాఖ (ఎన్ఎస్వో) తెలిపింది. 2021-22 క్యూ2లో ఇది రూ.56.20 లక్ష కోట్లుకాగా, ఈ ధరల కోణంలో జీడీపీ 16.2 శాతం వృద్ధి చెందినట్లు లెక్క. 2021-22 క్యూ2లో ఇది 19 శాతం వృద్ధిచెందింది.
తగ్గుదలకు కారణాలివి..
ఉక్రెయిన్పై రష్యా దాడులతో చమురు, ఇతర కమోడిటీ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పరుగులు తీయ డం, సరఫరా అవరోధాలు ఏర్పడటం వృద్ధిని దెబ్బతీసిందని విశ్లేషకులు చెప్పా రు. ఇందుకు తోడు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతూపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపించిందన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఆర్బీఐ 190 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. జూలై-సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 7.4 శాతానికి ఎగిసింది. ఇక వృద్ధి మందగమనానికి ప్రధానంగా తయారీ రంగం కుదేలవ్వడం కారణం. ఇది 4.3 శాతం వృద్ధినే కనపర్చింది. బలహీన తయారీ రంగం, కార్పొరేట్ లాభాల మార్జిన్ల తగ్గుదలతో వృద్ధి దిగువబాట పడుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల్లో హెచ్చరించింది.
6.8-7% వృద్ధి సాధిస్తాం
ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.8-7 శాతం వృద్ధి సాధించేదిశగా కదులుతున్నదని కేంద్ర చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ వీ అనంత నాగేశ్వరన్ విశ్వాసం వ్యక్తం చేశారు. క్యూ 2 గణాంకాలు వెలువడిన అనంతరం ఈ అంచనాల్ని వెల్లడించారు.
రూ.7.58 లక్షల కోట్లకు ద్రవ్యలోటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ చివరికల్లా ద్రవ్యలోటు పూర్తి సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో 45.6 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022-23 ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ద్రవ్యలోటు రూ.7,58,137 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదేకాలంలో బడ్జెట్ అంచనాల్లో ఇది 36.3 శాతమే ఉంది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటును (జీడీపీలో 6.4 శాతం) కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకుంది.
అంచనాలిలా..
రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.8 శాతం నుంచి 7.2 శాతం మధ్యలో ఉంటుందంటూ కొద్దిరోజులగా వివిధ ఆర్థికవేత్తలు, సంస్థల నుంచి అంచనాలు వెలువడ్డాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వృద్ధి మందగిస్తుందని వారు చెపుతూ వచ్చారు. వృద్ధి 6.1-6.3 శాతం శ్రేణిలో ఉంటుందని రిజర్వ్బ్యాంక్ అంచనా వేసింది.
బేస్ ఎఫెక్ట్
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్లో 13.5 శాతం వృద్ధి నమోదు కావడానికి బేస్ ఎఫెక్ట్ కారణమని, ఆ సానుకూలత సెప్టెంబర్ త్రైమాసికంలో లేకపోవడంతో క్యూ1కంటే బాగా తగ్గుదల కన్పిస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2021 ఏప్రిల్-జూన్లో కొవిడ్ నియంత్రణల ఫలితంగా వృద్ధి రేటు కుంచించుకుపోయినందున, ఆ ప్రభావంతో ఈ క్యూ1లో భారీ వృద్ధి రేటు నమోదయ్యింది. బేస్ ఎఫెక్ట్స్తో సాధించిన రెండంకెల వృద్ధి రేటు తగ్గుతుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్ సీనియర్ ఎకానమిస్ట్ రాధికా రావు తెలిపారు. ఎగుమతులు తగ్గినందున దేశీ డిమాండ్దే వృద్ధిలో కీలక పాత్ర అని చెప్పారు.
చైనా కంటే మెరుగు
పొరుగు దేశమైన చైనా కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటును నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్లో చైనా జీడీపీ 3.9 శాతం వృద్ధి చెందింది. అయితే తొలి త్రైమాసికంలో ఆ దేశం కనపర్చిన 0.4 శాతం వృద్ధి రేటుకంటే తాజాగా ముగిసిన త్రైమాసికంలో పెరగ్గా, భారత్ది మాత్రం గత మూడు నెలలకంటే తగ్గింది. ప్రస్తుతం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్..అమెరికా కనపర్చిన 2.6 శాతంకంటే అధిక వృద్ధిని సాధించింది.