న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత్ ఆర్థికాభివృద్ధి రేటును ఐక్యరాజ్య సమితి (యూఎన్) భారీగా తగ్గించింది. 2022లో ఇది 5.7 శాతానికి దిగుతుందని యూఎన్కి చెందిన ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ కాన్ఫెరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) విడుదల చేసిన 2022 సంవత్సరపు నివేదికలో అంచనా వేసింది. 2021లో ఈ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. 2023లో భారత్ జీడీపీ వృద్ధి రేటు మరింతగా 4.7 శాతానికి పడిపోతుందని పేర్కొంది. చమురు దిగుమతి బిల్లు పెరుగుతున్నందున, వాణిజ్యలోటు తీవ్రతరమవుతుందని, దిగుమతులకు అవసరమైన విదేశీ మారక నిల్వలు తగ్గడం ప్రతికూలాంశమని యూఎన్ ఏజెన్సీ వివరించింది. అధిక వడ్డీ భారం, ప్రభుత్వ వ్యయాల్లో తగ్గుదల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయని, 2022లో జీడీపీ వృద్ధి 5.7 శాతానికి క్షీణిస్తుందని తెలిపింది. రానున్న రోజుల్లో ప్రత్యేకించి రైల్వేలు, రహదారుల రంగాల్లో మూలధన వ్యయాలు పెంచుతామన్న ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని, అయితే బలహీన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఆర్థిక అసమతౌల్యాలను తగ్గించడానికి విధాన నిర్ణేతలు ఒత్తిడిని ఎదుర్కొంటారని, దీంతో ప్రభుత్వ వ్యయాలు తగ్గుతాయని హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 2023లో ఆర్థికాభివృద్ధి రేటు మరింతగా 4.7 శాతానికి దిగిపోతుందంటూ నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ప్రపంచ దేశాల వృద్ధిపై అంచనాలు ఇవి…
v దక్షిణాసియా ప్రాంతం 2022లో 4.9 శాతం వృద్ధి చెందవచ్చు. 2023లో ఇది 4.1 శాతానికి దిగజారుతుంది.
v 2021లో 5.7 శాతంగా ఉన్న అమెరికా ఆర్థికాభివృద్ధి 2022లో 1.9 శాతానికి పరిమితం. 2023లో ఇది 0.9 శాతానికి తగ్గొచ్చు.
v చైనా జీడీపీ 2022లో 3.9 శాతం, వచ్చే ఏడాది 5.3 శాతం పెరగొచ్చు. 2021లో ఇది 8.1 శాతం.