ముంబై, జూలై 8: దేశంలో విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ నెల 1తో ముగిసిన వారంలో 5.008 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 588.314 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 14 నెలలకుపైగా కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఇక విదేశీ నగదు ఆస్తుల్లో (ఎఫ్సీఏ) క్షీణతే ఇందుకు కారణంగా ఆర్బీఐ పేర్కొనగా.. మొత్తం దేశీయ ఫారెక్స్ నిల్వల్లో ఎఫ్సీఏ వాటానే ఎక్కువ. జూలై 1తో ముగిసిన వారంలో 4.471 బిలియన్ డాలర్లు ఎఫ్సీఏ తగ్గినట్టు తేలింది. అయితే అంతకుముందు వారం 2.734 బిలియన్ డాలర్లు పెరిగి 593.323 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు చేరినా.. తర్వాతి వారంలో దాదాపు రెట్టింపు స్థాయిలో కరిగిపోవడం మాత్రం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు పసిడి నిల్వలు కూడా 504 మిలియన్ డాలర్లు పతనమై 40.422 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కాగా, ఇటీవలే దేశంలో ఫారెక్స్ నిల్వల్ని పెంచడానికి ఆర్బీఐ పలు నిర్ణయాలు తీసుకున్నది తెలిసిందే. ఇందులో భాగంగా ప్రవాస భారతీయులను ఆకర్షించడానికి బ్యాంక్ డిపాజిట్ల వడ్డీరేట్ల పెంపునకూ అనుమతినిచ్చింది.
రూపీ మరో 13 పైసలు పతనం
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో మరో 13 పైసలు పతనమైంది. ముగింపులో 79.26 వద్ద నిలిచింది. గురువారం కూడా 19 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఒకానొక దశలో 79.32 స్థాయికీ పడిపోయింది. బుధవారం 39 పైసలు కోలుకున్నా.. గురు, శుక్రవారాల్లో నష్టాలు.. రూపాయి పెరుగుదల తాత్కాలికమేనని తేల్చిచెప్పాయి. రూపాయి విలువను పెంచేందుకు ఆర్బీఐ డాలర్లను అమ్ముతుండటం కూడా ఫారెక్స్ నిల్వల్ని తగ్గిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.